కలకలం రేపిన దళిత మహిళ ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లాలో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అధికారులు బలవంతంగా తమ భూమిలో సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుండడంతో మనస్తాపానికి గురై ఆమె పురుగులు మందు తాగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలో సచివాలయం నిర్మాణానికి కొంత భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భూమిపై కోర్టులో విచారణ జరుగుతున్నా.. స్థానిక YCP నేత, మండల కన్వీనర్ నాగముని ఒత్తిడితో అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని బాధిత కుటుంబాలు వాపోతున్నారు. శనివారం అధికారులు జేసీబీ సాయంతో భూమిని చదును చేసేందుకు ప్రయత్నించడంతో లక్ష్మి అనే మహిళ పురుగులు మందు తాగింది. స్థానిక నేతల ఒత్తిడితో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com