ప్రధాన పార్టీల్లో టెన్షన్..రేపటితో ఆ ఉత్కంఠకు తెర

ప్రధాన పార్టీల్లో టెన్షన్..రేపటితో ఆ ఉత్కంఠకు తెర

తెలంగాణలో వరస కౌంటింగ్ లు ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ప్రాదేశి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఉత్కంఠ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 సెంటర్లలో రేపు లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకుండా ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లువడ్డాయి.. ఇక ప్రాదేశిక నియోజకవర్గాల టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్‌కు రంగం సిద్దమైంది. రాష్ట్రంలో 3 విడతల్లో మొత్తం 5 వేల 817 ఎంపీటీసీ స్థానాలు, 5వందల 38 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనిలో 4 జెడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడంతో.. 534 జెడ్పీటీసీ, 5 వేల 659 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు.

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో లెక్కింపు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మొత్తం 536 స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపర్చిన బ్యాలెట్‌ బాక్స్‌లను లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రక్రియ చేపడతారు. కోటీ 20 లక్షల 86 వేల 385 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు..

గతనెల 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. లెక్కింపును కూడా అదేనెల 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట భావించింది. తరువాత సాంకేతిక కారణాలతో వాయిదా వేసింది. జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు దాదాపు 42 రోజుల సమయం ఉండటం, క్యాంపులతో ప్రలోభాలకు గురిచేసే అవకాశాలున్నాయనే ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, జెడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 8న, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఈ నెల 7న నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్, షెడ్యూల్‌ జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 123 కౌంటింగ్‌ కేంద్రాల్లో బ్యాలెట్‌ పేపర్లు లెక్కించనున్నారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కించనుండగా… ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 978 కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేయగా… 11,882 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 23,647 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లతో కలుపుకుని మొత్తం 35,529 మంది కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు. సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం నుంచే ఫలితాల తెలిసే అవకాశం ఉంది.

ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా కౌంటింగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో అవాంచనీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డంతో పాటు .. మ‌ద్యం దుకాణాలు కూడా మూసి వేయాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story