రైతు బంధు నిధుల విడుదల.. పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు..
తెలంగాణలో రైతు బంధు పథకానికి నిధులు విడుదలయ్యాయి. సుమారు 6వేల 900 కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఖరీఫ్లో రైతుల పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి. విత్తనాలు, సాగుకు సంబంధించిన ఖర్చులకు రైతు బంధు కింద వచ్చే డబ్బులు ఉపయోగపడనున్నాయి.
కేసీఆర్ సర్కారు గతేడాది ఖరీఫ్, రబీల్లో రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా అందజేసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సీజన్లకు కలిపి ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఏటా ఖరీఫ్కు సంబంధించి రైతు బంధు సాయాన్ని మేలోనే ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల కోడ్ వంటి కారణాలతో కొద్దిగా ఆలస్యమైంది.
రైతుబంధు కోసం ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. గతేడాది సాయం అందజేసిన ప్రతి రైతుకు ఈసారి కూడా సాయం అందివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు సాయం నిలిపేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com