వయగ్రా కోసం వెళ్లిన 8 మంది..
హిమాలయా వయాగ్రా పేరుగాంచిన యార్సాగుంబా కోసం వెళ్లిన 8 మంది మృతి చెందారు. నేపాల్లోని డోప్లా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 8 మందిలో ఐదుగురు అనారోగ్యంతో మరణించగా.. మరో ఇద్దరు ఈ వనమూలికను తీసుకునే క్రమంలో కొండపై నుంచి జారిపడి చనిపోయారు.
చాలా అరుదుగా లభించే వనమూలిక యార్సాగుంబా. కిలో యార్సాగుంబా ధర రూ. 60 లక్షల పైమాటే. గ్రామీణ నేపాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ వెళ్తుంటారు. హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలుపెడితే చాలు.. నేపాలీలు పచ్చిక బయళ్ల వైపు పరుగు తీస్తారు.. నెల రోజుల పాటు యార్సాగుంబా కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. పసుపు పచ్చ రంగులో ఉండే ఇది బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడంతో పాటు పుష్కలమైన ఔషధ గుణాలు ఈ మూలిక సొంతం.
గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్ ఛాంగ్ అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది.
యార్సాగుంబా సేకరించేవారి కోసం ప్రభుత్వం హెల్త్క్యాంప్లు కూడా ఏర్పాటు చేసింది. చాలామంది సేకరణదారులు ఈ హెల్త్క్యాంప్ల్లో చికిత్స పొందారని అధికారులు వెల్లడించారు. నేపాల్ రాజధాని ఖట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో ఉండే డోప్లా జిల్లాలో యార్సాగుంబా సేకరణదారులు ఎక్కువగా ఉంటారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com