చంద్రయాన్-2 ప్రయోగానికి 12 ఏళ్ల క్రితమే ప్లాన్

చంద్రయాన్-2  ప్రయోగానికి 12 ఏళ్ల క్రితమే ప్లాన్

భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోయే ఘట్టం ఆవిష్కృతం కానుంది. అంతరిక్ష పరిశోధనల్లో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఖగోళ ప్రయోగాల్లో తిరుగులేని సత్తాతో దూసుకుపోతున్న ఇస్రో.. జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసే ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. దేశ ప్రజల ఆశలను మోసుకెళ్లి చంద్రునిపై కాలు మోపే చంద్రయాన్‌-2 ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం తెల్లవారుజామున సరిగ్గా 2 గంటల 51 నిమిషాలకు జీఎస్‌ఎల్వీ-ఎమ్‌కే-3 రాకెట్ నిప్పులు చిమ్ము కుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. కోట్లాది మంది ప్రజల ఆశలను మోసుకుంటూ చంద్రయాన్-2 మిషన్ అంతరిక్షంలోకి ప్రయాణించనుంది. ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్‌-2 ప్రయోగం మీదనే. ప్రపంచ అంతరిక్ష పరిశోధకులు ఈ కీలక ఘట్టం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చంద్రయాన్‌-1 ప్రయోగంతో జాబిలిపై నీటిజాడను కనుగొని ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది ఇస్రో.

మరికొద్ది గంటల్లో రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనున్న నేపథ్యంలో షార్‌లో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు ఇస్రో చైర్మన్‌ శివన్‌. ప్రయోగం కోసం సైంటిస్టులు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు ప్రయోగాన్ని తిలకించేందుకు ఇవాళ సాయంత్రం రాంనాథ్‌ కోవింద్‌తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు శ్రీహరి కోటకు చేరుకోనున్నారు. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 10 వేల మందికి అనుమతి ఇచ్చింది ఇస్రో. ఈ నేపథ్యంలో సూళ్లూరు పేట నుంచి శ్రీహరి కోటకు ప్రత్యేక బస్సులు నడుపనుంది ఆర్టీసీ. ప్రస్తుతం షార్‌ పరిసర ప్రాంతాలు నిఘా నేత్రంలోకి వెళ్లిపోయాయి. ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితం అమెరికా చంద్రునిపై అడుగు పెట్టింది. రష్యా, చైనా తదితర అగ్రదేశాలు కూడా జాబిలిపైకి వెళ్లొచ్చాయి. కానీ ఆ దేశాలు సైతం కాలు మోపని చోటుకు చంద్రయాన్-2 వెళ్తోంది. అదే చందమామ దక్షిణ ధ్రువం. అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కూడా పరిశోధనలు చేయని ప్రాంతానికి మన దేశం అడుగుపెట్టబోతోంది.

చంద్రయాన్-2 ద్వారా 3 మాడ్యూళ్లను చంద్రునిపైకి చేర్చనున్నారు. విక్రమ్ పేరున్న ల్యాండర్, ప్రజ్ఞాన్ పేరుతో ఉన్న రోవర్‌లను జాబిలిపైకి పంపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం బ‌రువు సుమారు 3.8 ట‌న్నులు. ఇందులో ప్రొపెల్లంట్ బ‌రువే సుమారు 1.3 ట‌న్నులు. కౌంట్‌డౌన్ పూర్తై నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత GSLV-MK3 రాకెట్ కాంపోజిట్‌ మాడ్యూల్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. అనంతరం దాని కక్ష్యను శాస్త్రజ్ఞులు దశలవారీగా 16 రోజుల పాటు పెంచుకుంటూ పోతారు. తర్వాత 5 రోజులకు అది చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. అక్కడ 27 రోజులపాటు చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. ఈ దశలో ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌..... మూన్‌ దిశగా పయనించి సెప్టెంబరు 6-7 తేదీల్లో జాబిలి దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ అవుతుంది. దాదాపు 54 రోజుల పాటు నిర్విరామంగా 3 లక్షల 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోనుంది చంద్రయాన్‌-2 మిషన్. చంద్రయాన్-2 ప్రాజెక్టు మొత్తం ఖర్చు 978 కోట్లు. ఇది పూర్తిగా మన దేశంలో అభివృద్ధి చేసిన ప్రాజెక్టు. నేవిగేషన్‌, గైడెన్స్‌ కోసం నాసా డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌కు చెల్లింపులు జరిపి మనదేశం ఉపయోగించుకుంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 13 రకాల పరికరాలను జాబిలిపైకి పంపిస్తున్నారు. వీటి సాయంతో చంద్రుని ఉపరితలం అధ్యయనం, అక్కడి ఖనిజ వనరులు, నీరు, ఇంధన నిల్వలను విశ్లే షిస్తారు.

చంద్రయాన్‌-2 ప్రయోగానికి సన్నాహకాలు 12 ఏళ్ల క్రితమే మొదలయ్యాయి. ఇస్రోకు.. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థకు మధ్య 2007 నవంబరు 12న ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం.. చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్‌, జాబిలిపై దిగే రోవర్ల బాధ్యత ఇస్రోది. ఈ రెండింటినీ రాకెట్‌లో మోసుకెళ్లే ల్యాండర్‌ నిర్మాణ బాధ్యత రష్యాది. 2008 సెప్టెంబరు 18న యూపీఏ-1 సర్కారు ఈ మిషన్‌కు ఆమోదం తెలిపింది. 2009 ఆగస్టులో వ్యోమనౌక డిజైన్‌ పూర్తైంది. ఐతే. ల్యాండర్‌ నిర్మాణంలో రష్యా విఫలం కావడంతో మిషన్‌ను వాయిదా వేస్తూ 2013 జనవరిలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరకాలంలో రష్యా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొంది. దాంతో ఇస్రో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. అసమాన పట్టుదలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ల్యాండర్‌ను తయారు చేసింది. ఇందు కోసం ఇస్రో సైంటిస్తులు నిరంతరం చెమటోడ్చారు. సెప్టెంబ‌ర్ 6 లేదా 7 తేదీల్లో చంద్రయాన్‌-2 రోవ‌ర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండవుతుంది. మొత్తం ప్రయోగంలో ఇదే కఠినమైనది. ప్రాజెక్టు విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల సరసన మనదేశం సగర్వంగా నిలవనుంది.

Tags

Read MoreRead Less
Next Story