జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. నీరు నిలిచే చోట మిషన్ 'ఇంజెక్షన్ బోర్ వెల్ '
గ్రేటర్ హైదరాబాద్లో ముందుగానే ముంపు చర్యలపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. భారీ వర్షాలు పడే సమయంలో ముంపుకు గురయ్యే 160 లొకేషన్లలో ముంపు సమస్య తీవ్రతను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. జె.ఎన్.టి.యుకి చెందిన నిపుణులైన ప్రొఫెసర్లను జీహెచ్ఎంసీకి పలు సిఫార్సులతో కూడిన నివేదికలను అందజేశారు. వాటి అమలు దిశగా ఇంజనీరింగ్ విభాగం ప్రస్తుతం పనులు చేపట్టింది. శేరిలింగంపల్లి సర్కిల్లోని కాకతీయ హిల్స్ రహదారి దగ్గర నీరు నిలిచే ప్రాంతంలో ఇంజక్షన్ బోర్బావుల తవ్వకాన్ని ప్రారంభించారు.
కాకతీయ హిల్స్లో 1500 నుండి 2000 అడుగుల వరకు బోరుబావులను తవ్వితేనే నీరు లభిస్తుంది. ఈ ప్రాంతంలో దాదాపు 500 ఫీట్ల మేరకు ఈ ఇంజక్షన్ బోర్వెల్ను తవ్వుతున్నారు. ఈ ఇంజక్షన్ బోర్వెల్లో భాగంగా ముంపుకు సమీపంలోని ఖాళీ స్థలంలో బోరు బావిని తవ్వించి చుట్టూ వరద నీరు ఇంకేలా తగు ఏర్పాట్లను చేపట్టారు. ఈ ఇంజక్షన్ బావి ద్వారా వరదనీరు ఇంకడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం కూడా పెరుగుతుందని, ఈ పనులను పర్యవేక్షిస్తున్న కార్యనిర్వాహక ఇంజనీర్ చిన్నారెడ్డి తెలిపారు. మెగాహిల్స్ 100 ఫీట్ల రహదారి పై కూడా ఇంజక్షన్ బోర్వెల్ను ఏర్పాటు చేస్తున్నట్టు చిన్నారెడ్డి తెలిపారు. ఒకొక్క ఇంజక్షన్ బోర్వెల్కు సుమారు రెండు లక్షల రూపాయల వ్యయం మాత్రమే అవుతుందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com