ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్న డీకే కుమార్తె ఐశ్వర్య
మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య ఢిల్లీకి చేరుకున్నారు. తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు సమన్లు ఇవ్వడంతో... ఆమె గురువారం ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. ఐశ్వర్య పేరుతో అనేక లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో... ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు పంపింది. ఇందుకోసం ఆమె ఈడీ ముందు హాజరవుతున్నారు.
ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ఐశ్వర్య... తమ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థకు యాక్టివ్ ట్రస్టీగా ఉన్నారు. ఆమెకు వంద కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు గుర్తించింది ఈడీ. ఆమె పేరుతో జరిగిన లావావేదీలపై దృష్టి పెట్టిన ఈడీ... ఆమెను ప్రశ్నించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈడీ కార్యాలయానికి రావాలంటూ సమన్లు జారీ చేసింది. డీకే శివకుమార్ సమక్షంలోనే.. ఈ లావాదేవీలకు సంబంధించి ఐశ్వర్యను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. డీకే శివకుమార్ తన ఆస్తుల వివరాలు, కుటుంబ ఆస్తుల వివరాలను ఎన్నికల కమీషన్కు అఫిడవిట్ ఇచ్చారు. తన కుమార్తె ఐశ్వర్య కు వంద కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే... కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఐశ్వర్యకు వంద కోట్ల ఎలా ఆస్తి వచ్చిందన్న దానిపై ఇప్పుడు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ ఎంక్వైరీ పూర్తైన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
Also watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com