రూ.25వేలు లంచం డిమాండ్.. గేదెను తహసిల్దార్ కారుకు కట్టేసిన రైతు
కాలం మారుతున్న కొద్దీ సమాజం కూడా నవీకరణ పథంలో సాహసికంగా ముందడుగు వేస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పని జరిగేది కాదు. ప్రస్తుతం ప్రజల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. లంచాలు అడిగిన ఆఫీసర్లకు తగిన విధంగా బుద్ధి చెప్తున్నారు. తాజాగా లంచం అడిగిన అధికారికి.. ఓ రైతు తగిన గుణపాఠం చెప్పాడు. మధ్యప్రదేశ్లోని సిరోంజ్ జిల్లాకు చెందిన భూపేంద్ర సింగ్ అనే రైతుకు వారి కుటుంబ సభ్యులతో భూతగాదాలు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించడం కోసం స్థానిక తహసిల్దార్ సిద్ధార్థ సింగాల్ రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశాడు. దానికి భూపేంద్ర తను పేదవాడినని అంత లంచం ఇచ్చుకోలేనని ప్రాధేయపడ్డాడు.
అయినా కూడా ఆ అధికారి మనస్సు కరగలేదు. భూపేంద్ర అనేకసార్లు తహసిల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినప్పటికీ పని మాత్రం కావడం లేదు. దీంతో విసిగిపోయిన అతను తన పాడి గేదెను తీసుకువచ్చి సిద్ధార్థ సింగాల్ కారుకు కట్టివేశాడు. లంచంగా తన గేదెను ఉంచుకోవాలని ఆ తహసిల్దార్ను కోరాడు.
ఈ విషయం అందరికీ తెలియడంతో తహసిల్దార్ సిద్ధార్థ ఆందోళన చెంది లంచం వద్దని గేదెను తీసుకెళ్లాల్సిందిగా భూపేంద్రను కోరాడు. కానీ భూపేంద్ర వెనక్కి తగ్గకుండా అతనిపై ముఖ్యమంత్రి, జిల్లా అధికారి చర్యలు తీసుకున్న తర్వాతే గేదెను ఇంటికి తీసుకెళ్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. విషయం కాస్తా మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు తహసిల్దార్కు మెమొరాండం అందజేశారు. సిద్ధార్థపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com