బడాబాబుల భాగోతం.. చనిపోయినవాళ్లే డబ్బు డ్రా చేసుకున్నట్టుగా
తూర్పు గోదావరి జిల్లాలో రైతులకు ఆర్థిక సహకారం అందించాల్సిన సహకార సంఘాలు బడాబాబుల జేబు సంస్థలుగా మారుతున్నాయి. రైతులకు సహకారాన్ని మరచిన సంఘాలు పెద్దలకు ఫలహారశాలలుగా మారిపోయాయి. రైతులకు కోట్లాది రూపాయలు రుణాలు అందజేశామంటూ ఘనంగా చేస్తున్న ప్రకటనలు అంతా డొల్లేనని తేలింది. అడ్రస్ లేని వారికి లోన్లు ఇచ్చిన బాగోతం వెలుగులోకి వచ్చింది.
బతికున్నవాళ్లతోపాటు చనిపోయినవారి పేర్లపై కూడా సహకార సంఘాలు లోన్లు మంజూరు చేశాయి. ఓ అడుగు ముందుకేసి మరణించిన వ్యక్తి లోన్ మొత్తాన్ని డ్రా చేసుకున్నట్టు చూపించారు. ఇలా జిల్లాలోని పలు సహకార సంఘాల పెద్దలు అడ్రస్ లేని వారి పేర్లతో కోట్లాది రూపాయల నిధులను అడ్డగోలుగా దోచేశారు. ఈ భాగోతంపై దృష్టి పెట్టిన TV 5 రంగంలోకి దిగింది. జిల్లాలోని లంపకలోవ సహకార సంఘంలో 10 కోట్ల రూపాయల మేర నిధులు గోల్ మాల్ అయిన వ్యవహారం వెలుగు చూసింది.
15 గ్రామాల రైతులు సభ్యులుగా ఉన్న లంపకలోవ వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘం టర్నోవర్ 25 కోట్లు. అంతపెద్ద మొత్తం టర్నోవర్ కలిగిన ఈ సంఘంలో 10 కోట్ల రూపాయలను అడ్రస్ లేనివారికి, మరణించిన వారికి లోన్లుగా ఇచ్చిన దోపిడీ బయటికొచ్చింది. మరణించిన వ్యక్తికి ఏకంగా రెండు సార్లు రుణాలు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపడం పెద్దల దోపిడీకి పరాకాష్టగా నిలుస్తోంది. సహకార సంఘంలో పెద్దల దోపిడీపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com