సౌతాఫ్రికా ఆలౌట్‌.. భారీ విజయాన్ని టార్గెట్‌ చేసిన టీమిండియా

సౌతాఫ్రికా ఆలౌట్‌.. భారీ విజయాన్ని టార్గెట్‌ చేసిన టీమిండియా

రెండో టెస్టులోనూ భారీ విజయాన్ని టార్గెట్‌ చేసింది టీమిండియా.. పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను కేవలం 275 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆరీగా 326 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 601 పరుగులకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. దక్షిణాఫ్రికా ఆలౌట్‌ అయిన వెంటనే.. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో.. అంపైర్లు మ్యాచ్‌ని వాయిదా వేశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కెప్టెన్‌ విరాట్ ద్విశతకం, మయాంక్ సెంచరీ, పుజారా, జడేజా, రహానేలు అర్థ శతకాలు చేయడంతో ఐదు వికెట్లు కోల్పోయి.. 601 పరుగులు చేసింది. ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్లు రాణించడంతో 53 పరుగుల దగ్గరే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ దశలో డుప్లెసిస్ 64 రన్స్‌, డికాక్ 31 రన్స్‌తో కుదుటపడేందుకు ప్రయత్నించిన.. ఫలితం మాత్రం భారత్‌కు అనుకూలించింది. 162 పరుగుల వద్ద ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో పర్యాటక జట్టు 200లోపే చాప చుట్టేసేలా కనిపించింది. కాని కేశవ్ మహారాజ్ 72 పరుగులు, వెర్నాన్ ఫిలాందర్‌ 44 రన్స్‌తో కాసేపు పోరాటం చేశారు. అశ్విన్ వేసిన 102వ ఓవర్ నాలుగో బంతికి మహారాజ్.. రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత కాసేపటికే రబాడా ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలయన్ చేరాడు. దీంతో సౌతాఫ్రికా 105.4 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు ప్రకారం ఆ జట్టు ఫాలో ఆన్‌ ఆడాల్సి ఉంది. మరి రేపటి ఆటలో విరాట్‌ కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.. బౌలర్లకు శ్రమ ఎందుకు ఇవ్వడం అనుకుంటే.. రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించి.. మరో రెండు వందల పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసే అవకాశం ఉంది. 500లకుపైగా లక్ష్యాన్ని చేధించడం దక్షిణాఫ్రికాకు దాదాపు అసాధ్యం అవుతుంది. బౌలర్లు తమకు విశ్రాంతి అవసరం లేదనుకుంటే.. సౌతాఫ్రికాను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం ఉంది.. తొలి ఇన్నింగ్స్‌లానే భారత బౌలర్లు.. ఫాలో ఆన్‌ను కొనసాగించి విజృంభిస్తే.. ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచే అవకాశం కూడా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story