మళ్లీ బయటపడిన పాకిస్థాన్ వక్రబుద్ది
పాకిస్థాన్ వక్రబుద్ది మళ్లీ బయటపడింది. కర్తార్పూర్ కారిడర్ విషయంలో పాక్ దుర్నీతి ప్రదర్శించింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులకు పాక్ ప్రభుత్వం మద్ధతు పలికింది. కర్తార్పూర్ కారిడార్పై రూపొందించిన ప్రమోషనల్ వీడియోలో ఖలిస్థాన్ వేర్పాటువాదులను ప్రస్తావించింది. పాకిస్థాన్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వీడియోలో, జర్నైల్ సింగ్ బింద్రన్వాలే సహా ముగ్గురు ఖలిస్థాన్ ఉగ్రవాదుల చిత్రాలు ఉన్నాయి. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. కర్తార్పూర్ కారిడార్ను అడ్డుపెట్టుకొని ఖలిస్థాన్ ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని భారత ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా పాక్ తీరుపై ధ్వజమెత్తారు. కర్తార్పూర్ కారిడార్ పేరుతో పంజాబ్లో ఉగ్రవాదాన్ని పునరుద్దరించడానికి పాక్ కుట్రలు పన్నుతుందేమోనని అమరీందర్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు.
కర్తార్పూర్ కారిడర్ను వచ్చే నెల ప్రారంభించనున్నారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ వైపు కారిడర్ను ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు పాక్ తమ వైపు ఉన్న కారిడార్ను ప్రారంభిస్తుంది. ఇందుకు సంబంధించి పాక్ ప్రభుత్వం ప్రమోషనల్ వీడియో రూపొందించింది. అందులో ఆపరేషన్ బ్లూస్టార్లో మరణించిన బింద్రన్వాలే, మేజర్ జనరల్ షాబెగ్ సింగ్, అమ్రిక్ సింగ్ ఖల్సాలను కూడా చేర్చారు. బింద్రన్వాలే, సిక్కు రెలిజియెన్ సెక్ట్ దాందామి తక్త్కు అధిపతిగా ఉండేవాడు. షాబెగ్ సింగ్, ఇండియన్ ఆర్మీ జనరల్గా పనిచేసి పదవీ విరమణకు ముందు అవినీతి కేసులో కోర్టు మార్షల్ విచారణ ఎదుర్కొన్నారు. ఆయనకున్న ర్యాంక్ను కూడా తొలగించారు. అనంతరం 1984లో ఖలిస్థాన్ ఉద్యమంలో చేరారు. ఇక, ఖలిస్థాన్ విద్యార్థి నేతగా ఉన్న ఖల్సా ఆల్ ఇండియా సిఖ్ స్టూడెంట్ ఫెడరేషన్కు అధిపతిగా ఉండేవారు. ఈ ముగ్గురినీ 1984లో పంజాబ్లోని స్వర్ణదేవాలయంలో భారత ఆర్మీ మట్టుబెట్టింది. తాజాగా, కర్తార్పూర్ కారిడార్ ప్రారంభానికి సమయం దగ్గర పడిన వేళ, ఖలిస్థాన్ వేర్పాటువాదులను పాకిస్థాన్ ప్రస్తావించడం కలకలం రేపుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com