ప్రియాంక రెడ్డికి మద్దతుగా నిరసనలు, ఆందోళనలు
డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనను దేశవ్యాప్తంగా.. సామాన్యులే కాకుండా.. ప్రముఖులు సైతం ఖండిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. నిందితులను ఉరితీయాలంటూ నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు.
విజయవాడలో నిందుతుల్ని కఠినంగా శిక్షించాలంటూ సిద్ధార్థ మహిళా కాలేజీ విద్యార్థినులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రేపిస్టుల తరపున లాయర్లు వాదించకూడదని స్టూడెంట్స్ కోరుతున్నారు. ప్రియాంకపై దారుణానికి పాల్పడ్డవారిని ఫాస్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లోకి స్థానికులు, విద్యార్థులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రియాంకారెడ్డి హత్య చేసి నిందితులకు వెంటనే ఉరి శిక్ష విధించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు నిందితులకు మద్దతుగా మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరూ కోర్టులో వాదించబోరని బార్ కౌన్సిల్ తీర్మానం చేసింది. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేందుకు తాము కృషి చేస్తామంటున్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి తెలిపారు.
అటు తిరుపతిలో ప్రియాంక రెడ్డి ఘటనపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది. నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తోంది. చట్టాలను తీసుకురావడం కాదు.. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నినదించారు.
ఇందిరా పార్కులో బీజేపీ మహిళ మోర్చా నేతలు ప్రియాంకరెడ్డికి ఆందోళన నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. మరోసారి ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
శంషాబాద్లోని ప్రియాంకారెడ్డి ఇంటికి జాతీయ మహిళా కమిషన్ సభ్యులు చేరుకున్నారు. ఇప్పటికే ప్రియాంకారెడ్డి కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు.. సంఘటన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇప్పటికే ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆరోపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com