భారత పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
భారత పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో బుధవారం ఆ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వచ్చే వారం చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. హోంమంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశ పెడతారు. దానిపై చర్చ, ఆమోదం సమయంలో.. బీజేపీ ఎంపీలు అందరూ సభకు హాజరుకావాలని ఆ పార్టీ ఇప్పటికే ఆదేశించింది.
పౌరసత్వ సవరణ బిల్లు చట్ట రూపం దాల్చితే.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్కు చెందిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్సీ వర్గాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించేందుకు అడ్డంకులు ఉండవు. అయితే.. పౌరసత్వ సవరణ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం భారత లౌకిక విధానానికి విరుద్ధమని హస్తం నేతలు అంటున్నారు.
పౌరసత్వ సవరణ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. బీజేపీ మరింత పట్టుదలగా ముందుకెళ్తోంది. జమ్ము కశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తరహాలో.. ఈ బిల్లు చాలా ముఖ్యమైందని కేంద్ర కేబినెట్ మంత్రులు చెప్తున్నారు. ఎంపిక చేసిన కేటగిరీల్లో మాత్రమే శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఆ చట్టం తేబోతున్నట్టు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్లో హింసను ఎదుర్కొంటున్న ముస్లిమేతరులు.. శరణార్థులుగా వచ్చినందున.. వారిని మాత్రమే భారతీయులుగా గుర్తించే బాధ్యత తీసుకుంటామని కేంద్రం అంటోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com