రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు

రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు

tdp-round-table-meeting

ప్రజా రాజధాని-అమరావతి పేరిట రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది తెలుగుదేశం. అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టలేదన్న వైసీపీ విమర్శలతో ఇటీవలే రాజధాని ప్రాంతంలో పర్యటించారు చంద్రబాబు. ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి సీపీఐ, జనసేన, లోక్‌సత్తా పార్టీల ప్రతినిధులతోపాటు.. ప్రజా సంఘాలు కూడా హాజరయ్యాయి. అమరావతిపై పూర్తి వివరాలతో బుక్‌ను రిలీజ్ చేశారు చంద్రబాబు.. టీడీపీ హయాంలో రాజధాని ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

అమరావతి ప్రాజెక్టు తప్పని ప్రజలంటే... క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం లేనిపోని అపోహలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు. రాష్ట్ర విభజనతో ఇబ్బంది పడ్డామని... ఇప్పుడు రాజధాని విషయంలోనూ అన్యాయం జరిగితే మరింత తీవ్రంగా నష్టపోతామన్నారు.. ప్రజల చైతన్యంతోనే అమరావతి నిలబడుతుందని స్పష్టం చేశారు చంద్రబాబు..

అమరావతిని గ్రాఫిక్స్‌ అంటూ ఎగతాళి చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. వేల ఏళ్లు నిలిచే నగరం కోసం మంచి డిజైన్లు తయారు చేశామని చెప్పారు. రాష్ట్రానికి మంచిపేరు రావాలానే ఇదంతా చేశామన్నారు.కానీ వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో అభివృద్ధి మొత్తం ఆగిపోయిందన్నారు. రాజధాని ప్రాంతంలో పనిచేసే... 50 వేల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..అమరావతి పనులు ఆగిపోవడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు..

ఏపీ రాజకీయం మొత్తం ఇప్పుడు అమరావతి చుట్టూ తిరుగుతోంది.. ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం.. మంత్రులు రోజుకోమాట్ల మాట్లాడటంతో...గందరగోళం ఏర్పడింది.. రాజధానిపై పూర్తి క్లారిటీతో ప్రకటన చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story