ఎన్కౌంటర్తో ముగిసిన దిశ నిందితుల కథ
దిశ హంతకులు హతమయ్యారు. పోలీసుల నుంచి పారిపోతుండగా ఎన్కౌంటర్ చేసేశారు. దిశ హత్య కేసును విచారిస్తున్న పోలీసులు.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో నలుగురు నిందితులను చటాన్పల్లికి తీసుకెళ్లారు. వాళ్లు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో.. వాళ్లు తుపాకులకు పనిచెప్పాల్సి వచ్చింది.
కొన్నాళ్ల క్రితం శంషాబాద్ సమీపంలో జాతీయ రహదారి పక్కన దిశపై దారుణ అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్. సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత కిరాతకంగా హత్య చేశారు. ఆమె బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టారు. తాగిన మైకంలో దారుణానికి ఒడిగట్టామని పోలీసుల విచారణలో వాళ్లు చెప్పినట్టు సమాచారం. అయితే.. అందుకు ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో దిశను తగులబెట్టిన చటాన్పల్లికి వారిని తరలిస్తుండగా.. పారిపోయేందుకు ప్రయత్నించారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి పాల్పడడంతో.. వారిని ఎన్కౌంటర్ చేశారు.
హైదరాబాద్ శివార్లలో దిశపై జరిగిన దారుణ హత్యాచారంతో దేశమంతా ఉలిక్కిపడింది. అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పార్లమెంట్లోను చర్చ జరిగింది. దిశ నిందితులకు కఠిన శిక్ష విధించాలనే ఏకాభిప్రాయం వినిపించింది. ఆ శిక్ష.. నేరగాళ్లలో వణుకు పుట్టించేలా ఉండాలని జాతి మొత్తం ముక్తకంఠంతో నినదించింది. కొందరైతే.. ఆ నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఆడ పిల్లలపై అఘాయిత్యాలు ఆగుతాయనే అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే.. ఆ నలుగురి రాక్షసుల కథ ఎన్కౌంటర్తో ముగిసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com