వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు

వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు

babu

సీఎం జగన్ తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 3 రాజధానుల ప్రతిపాదనపై విమర్శలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే కానీ.. పరిపాలన కాదని అన్నారు. ఎన్నికలకు ముందు అమరావతికి సహకరిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. విశాఖలో ఆస్తులుకొని.. డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని మయసభతో పోల్చిన చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలు కౌరవుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతల్ని అసెంబ్లీలో సస్పెండ్ చేసి.. రాజధాని ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురంలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు టీడీపీ నేతలపై అక్రమంగా 640 కేసులు పెట్టారని ఆరోపించారు. జేసీ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తామని.. వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

ఏపీలో దోపిడీ, అరాచక రాజ్యం సాగుతోందని చంద్రబాబు అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని.. చేతనైతే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. నోరు ఉందికదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌తో పనిచేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని.. కేసుల్లో ఇరుక్కుంటే ఎవ్వరూ కాపాడలేరని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story