సువిధ రైలులో 200 నుంచి 300 శాతం అధిక ఛార్జీలు
ప్రయాణికుల బలహీనతలను రవాణ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. పండుగల సమయంలో రద్దీ పెరిగినప్పుడల్లా టిక్కెట్ ఛార్జీలు అమాంతం పెంచేసి ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. అయితే.. ఆర్టీసీ,ప్రైవేట్ ట్రావెల్స్ కొనసాగిస్తున్న ఈ నిలువుదోపిడీ రైల్వేశాఖకు కూడ ఎగబాకింది. దీనికి వారు పెట్టుకున్న ముద్దుపేరు" సువిధ".
సంక్రాంతి పండుగ వస్తోఎందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. రైళ్లు ఊపిరి సలపలేనంతగా ప్రయాణికులతో కిక్కిరిసి పోతాయి. ఈ సయయంలో ప్రయాణికుల కోసం అదనంగా రైళ్లు వేయాల్సింది పోయి ప్రయాణికుల నుంచి టిక్కెట్ల రూపంలో అధికంగా డబ్బులు గుంజుకునే అతి సులువైన మార్గాన్ని రైల్వేశాఖ అనుసరిస్తోంది.
ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్ నుంచి కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం మీదుగా 4 రైళ్లను నడుపుతోంది. తూర్పు కోస్తా రైల్వే కూడా సికింద్రాబాద్ -తిరుపతి,సికింద్రాబాద్- భువనేశ్వర్ మధ్య సువిధ రైళ్లను నడుపుతోంది. సంక్రాంతి పండుగ సీజన్ మొదలవ్వడంతో ప్రస్తుతం ఉన్న రైళ్లకు వెయిటింగ్ లిస్టే చాంతాడంత పెరిగిపోయింది. అయితే.. ఈరద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపాల్సిన రైల్వేశాఖ సువిధ పేరుతో సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్నామని చెప్పి.. 200 నుంచి 300 శాతం అదిక ఛార్జీలు వసూలు చేస్తోంది. ప్రయాణికుల బలహీనతలను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ బాదుతోన్న అదనపు ఛార్జీలపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com