చంద్రబాబు ప్రశ్నలకు మౌనం వహించిన పోలీసులు
అమరావతి పరిరక్షణ ర్యాలీలో భాగంగా జేఏసీతో కలిసి జిల్లాల్లో పర్యటిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలో పర్యటించిన ఆయన ఆదివారం నర్సరావుపేటలో అమరావతి పరిరక్షణ చైతన్య యాత్ర నిర్వహించారు. చంద్రబాబు పర్యటనతో భారీగా పోలీసుల్ని మోహరించారు. గుంటూరుతోపాటు.. పల్నాడు ప్రాంతంలోనూ అడుగడుగునా బలగాలను దింపారు.
అయితే..గుంటూరు పార్టీ ఆఫీస్ నుండి నర్సరావుపేట బయల్దేరిన చంద్రబాబుకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఆయన కాన్వాయ్ను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల నిర్బంధంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి ఖాకీల తీరుపై విమర్శించారు. తమను అడ్డుకుంటున్న పోలీసులు.. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అడిగే ప్రశ్నలకు పోలీసులు సమాధానమే ఇవ్వలేదు అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు.
పోలీసుల అడ్డంకులు దాటుకొని గుంటూరు జిల్లా నర్సరావుపేటలో అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. జోలె పట్టి విరాళాలు సేకరించారు. జేఏసీ ర్యాలీకి స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
అనంతరం నరసరావుపేటలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు..జగన్ పాలనపై మండిపడ్డారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్ ప్రకటించేవరకు పోరాడుతామన్నారు చంద్రబాబు. అసలు రాజధానిని తరలించాల్సిన అవసరం ఏంటని అడిగారాయన.
పోలీసుల తీరుపై మండిపడ్డారు చంద్రబాబు డీజీపీ చెప్పారని మహిళలను కొడతారా? అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని ఆ విషయం డీజీపీ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు చంద్రబాబు.
అంతకుముందు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీలక్ష్మీని చంద్రబాబు పరామర్శించారు. ప్రస్తుతం శ్రీలక్ష్మీ మాట్లాడలేని పరిస్థితి ఉందని.. ఆమెను చూస్తే బాధేస్తుందన్నారు. తాజా దుర్మార్గాలకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com