వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్
భారత్లో అద్బుతమైన వ్యాపార అవకాశాలున్నాయని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని అన్నారు. స్విట్జర్లాండ్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. "ఇండియా : ది ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్’’ అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో అద్భుతమైన అవకాశాలున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో వుందని గుర్తుచేశారు. ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టాప్ 5 సంస్థలు.. హైదరాబాద్ లో రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయని అన్నారు.
దావోస్ పర్యటనలో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కుమార్తో మంత్రి కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హెచ్పీఈ సీవోవో విశాల్ లాల్తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీఆర్ వారికి వివరించారు.
ఈ నెల 24 వరకు జరిగే 50వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు- సవాళ్లను నివారించడం అనే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. అలాగే ప్రపంచదేశాలకు చెందిన అనేకమంది పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్క్, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్క్, కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్ సహా పలురంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com