కాకతీయ కెనాల్ సాక్షిగా వీడని అనుమానాలు

కాకతీయ కెనాల్ సాక్షిగా వీడని అనుమానాలు

కరీంనగర్ రాజీవ్ రహదారి తరుచూ రక్తసిక్తమవుతోంది. నగర శివారులోని అల్గునూరు వద్ద కాకతీయ కెనాల్ లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం మానేరు బ్రిడ్జిపై నుంచి ఓ కారు అదుపుతప్పి కెనాల్ లో పడిపోయింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలిద్దరూ నీటిలో కొట్టుకుపోయారు. స్థానికుల సహాయంతో భర్త ప్రాణాలు దక్కించుకున్నా.. భార్య మాత్రం నీటమునిగి చనిపోయింది. అయితే, మృతదేహాన్ని వెతికే క్రమంలో కాలువలో నీటి సరఫరా ఆపేయడంతో.. మరో విషాద ఘటన వెలుగుచూసింది.

ఆదివారం రాత్రి ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో.. గాలింపు చేపట్టిన పోలీసులకు.. మరో విషాద ఘటన షాక్ కు గురిచేసింది. నీటి సరఫరా ఆపేయడంతో.. రాజీవ్ రహదారికి కిలోమీటర్ దూరంలో యాదవుల పల్లి వద్ద.. కాకతీయ కెనాల్ లో మరో కారును గుర్తించారు పోలీసులు. ఆ కారులో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. 15 నుంచి 20 రోజుల క్రితం రాత్రి వేళ కారు కాకతీయ కెనాల్లో పడినట్టుగా భావిస్తున్నారు. క్రేన్ సహాయంతో కారును వెలికి తీశారు. కారు వెనుక సీటులో కుళ్ళిపోయిన స్థితిలో ఇద్దరు స్త్రీలు. ఒక పురుషుడి మృతదేహాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు వారంతా బయటపడేందుకు యత్నించినట్టుగా అర్థమవుతుంది. అయితే.. కారు సెంట్రలైజ్డ్ లాక్ కావడంతో ఈజీగా ఓపెన్ కాలేదు. వారు నీటిలో మునిగి చనిపోయినట్టు తెలుస్తోంది.

సంఘటనా స్థలాన్ని కరీంనగర్ కలెక్టర్ శశాంక, పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి సోదరి రాధ, బావ సత్యనారాయణ రెడ్డి, వారి కూతురు వినయశ్రీగా గుర్తించారు. మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండి.. తరలించే అవకాశం లేకపోవడంతో అక్కడే పంచనామా, పోస్ట్ మార్టమ్ నిర్వహించారు అధికారులు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అటు, నారెడ్డి సత్యనారాయణ రెడ్డి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మూడేళ్ల క్రితమే సత్యనారాయణ రెడ్డి కుమారుడు చనిపోయాడు. ఆ విషాదం నుంచి సత్యనారాయణ రెడ్డి కుటుంబం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని.. ఇప్పుడు మొత్తం కుటుంబం మరణించడంపై బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, కేసు దర్యాప్తులో భాగంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. జనవరి 27న భార్య రాధ, కూతురు వినయశ్రీతో హైదరాబాద్ బయల్దేరిన నారెడ్డి సత్యనారాయణ రెడ్డి.. అప్పటి నుండి కనించకుండా పోయారు. దీని పై బంధువులు కూడా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వారంతా తరుచూ టూర్లకు వెళ్తుండటమే ఇందుకు కారణం. దీంతో వారు ఎప్పటిలాగే టూర్ లో వున్నారని బంధువులు భావించారు. అయితే ఇలా ప్రమాదానికి గురై మృతిచెందడంతో.. వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఏదేమైనా సత్యానారాయణ రెడ్డి కుటుంబం 20 రోజులుగా కనిపించకుండాపోయినా.. ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆత్మహత్య చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవని.. మృతుల బంధువు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు. తమ సోదరి రాధ ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నారని.. బావ సత్యనారాయణ రెడ్డికి ఫర్టిలైజర్ షాప్ ఉందని అన్నారు. వారి కూతురు వినయశ్రీ బీడీఎస్ చదువుతోందని.. వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తెలిపారు.

ఓ కుటుంబం 20 రోజులుగా కనిపించకుండాపోయినా.. సన్నిహితులు, బంధువులకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, 20 రోజులు గడిచినా ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాకవపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story