న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఘోర ఓటమి
న్యూజిలాండ్ గడ్డపై భారత్ జట్టు ఘోరంగా భంగపడింది. వరుస టెస్టు విజయాలతో కివీస్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీన చెత్త ప్రదర్శనతో టెస్టు సిరీస్లో ఓడింది. టెస్టు ఛాంపియన్ షిప్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జట్లను వరుసగా ఓడించిన టీమ్ ఇండియా న్యూజిలాండ్ గడ్డపై అత్యంత చెత్తగా ఆడింది. టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతున్న భారత్.. ఈ సిరీస్లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా ఈ పర్యటన టీమ్ ఇండియాకు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి పీడకలలా మిగిలిపోయింది.
మొదట టీ20 దుమ్మురేపిన భారత జట్టు.. వన్డే, టెస్టు సిరీస్ల్లో తేలిపోయింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో తొలిసారి పాయింట్లు కోల్పోయి భంగపాటుకు గురైంది. మరోవైపు.. ఎలాంటి పిచ్ పైన అయినా అవలీలగా బ్యాటింగ్ చేయగల పుజారా, రహానె లాంటి సీనియర్లు సైతం న్యూజిలాండ్ గడ్డపై రాణించలేకపోయారు. దీంతో ఇటీవల ఎన్నడూ లేని విధంగా ఘోరంగా ఓటములను చవిచూసింది.
హెగ్లే ఓవల్ గ్రౌండ్లో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను ఆ జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 52; టామ్ బ్లండెల్ 55 పరుగులతో రాణించారు. తరువాత మూడు వికెట్లు పడినా.. కివీస్ సునాయాస విజయం సాధించింది.
అంతకుముందు 6 వికెట్ల నష్టానికి 90/6 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 34 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన పది నిమిషాలకే.. హనుమ విహారి 9 పరుగుల దగ్గర ఔట్ అయ్యాడు. తర్వాతి ఓవర్ లోనే పంత్ పెవిలియన్కు చేరాడు. దీంతో భారత్ 97 పరుగుల వద్ద 8వ వికెట్ను కోల్పోయింది. తరువాత షమి, బుమ్రాలు స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. దీంతో 124 పరుగులకే భారత్ రెండో ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది.. జడేజా 16 పరుగులకే అజేయంగా నిలిచాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com