మార్కెట్లో దగ్గి ప్రాంక్ చేసిన మహిళ.. రూ.26 లక్షల ఆహార పదార్థాలు పారబోత
కరోనా మహమ్మారికి ప్రజలు గజగజవణుకుతున్నారు. ఎవరైనా తుమ్మితే చాలు భయడుతున్నారు. ఇక దగ్గితే అక్కడనుంచి పరార్. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ చేసిన పిచ్చి పనికి ఓ సూపర్మార్కెట్ ఏకంగా రూ.26 లక్షల విలువైన ఆహార పదార్థాలను పారబోయాల్సి వచ్చింది.
అమెరికాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
అమెరికాలో పెన్సిల్వేనియాలోని గెర్రిటీ సూపర్ మార్కెట్కు బుధవారం ఓ మహిళ షాపింగ్ వెళ్లింది. వస్తువులను చూస్తూ పలు మార్లు దగ్గింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే ఆ మహిళకు ఎలాంటి అనారోగ్యం లేదు. కావాలనే దగ్గింది. మార్కెట్ సిబ్బంది ఎలా స్పందిస్తారో చూడటానికి అలా చేశానని పోలీసులకు చెప్పింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆమె ఉద్దేశపూర్వకంగా ఆహార పదార్థాలపై దగ్గింది. దీన్ని ప్రాంక్గా తాము పరిగణించినప్పటికీ, కస్టమర్ల ఆరోగ్యం దృష్ట్యా.. సూపర్ మార్కెట్లో ఉన్న రూ. 26 లక్షల విలువైన ఆహార పదార్థాలు, నిత్యావసరాలను పారబోసినట్లు స్టోర్ యాజమాన్యం వెల్లడించింది. వెంటనే సూపర్ మార్కెట్ను పూర్తిగా శానిటైజ్ చేసి.. వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా కొన్ని గంటల వ్యవధిలోనే షాపును అందుబాటులోకి తెచ్చినట్లు యాజమాన్యం పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com