ఇప్పట్లో రైలు ప్రయాణాలొద్దు: కేసీఆర్

ఇప్పట్లో రైలు ప్రయాణాలొద్దు: కేసీఆర్

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని సీఎం కేసీఆర్‌.. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ పలు అంశాలపై మోదీకి రిక్వెస్ట్‌లు చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, FRBM పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని కేసీఆర్‌ సూచించారు. జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది, అది కూడా భారత్ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశం ఉందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని కేసీఆర్‌.. ప్రధాని మోదీకి చెప్పారు. దేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉందని.. కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయని కేసీఆర్ అన్నారు. అందరికీ టెస్టులు చేయడం కుదరదని.. రైళ్లలో వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ చేయడం కూడా కష్టమని.. ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడపొద్దు ప్రధాని మోదీకి కేసీఆర్ సూచించారు.

కరోనా ఇప్పుడిప్పుడే మనల్ని వదిలి పోయేట్టు కనిపించడం లేదన్నారు. కరోనాపై ప్రజల్లో భయాన్ని పోగొట్టాలన్నారు. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలన్నారు కేసీఆర్‌. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని.. హైదరాబాద్ కు చెందిన కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయి మోదీకి కేసీఆర్ వివరించారు. హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ వచ్చే చాన్స్ ఉందన్నారు.

కరోనా వల్ల ఆర్థిక సంవత్సరంపై ప్రభావం పడిందన్నారు. ఆదాయాలు లేవు.. అప్పులు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికీ లేదు కాబట్టి అన్ని రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలన్నారు కేసీఆర్‌. రైతుల రుణాలను ఎలాగైతే బ్యాంకులు రీ షెడ్యూల్ చేస్తాయో అలాగే రాష్ట్రాల రుణాలను రీ షెడ్యూల్ చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. వలస కార్మికుల విషయంలో అన్ని రాష్ట్రాలు సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలన్నారు కేసీఆర్‌. శ్రామిక్ రైళ్లు వేయడం మంచి నిర్ణయమని... తెలంగాణ నుంచి పోదామనుకుంటున్న వారిని పంపుతున్నాం... మళ్లీ అక్కడి కూలీలు వస్తున్నారని కేసీఆర్ అన్నారు.

కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అలక్ష్యం చేయవదన్నారు కేసీఆర్‌. పాజిటివ్‌ కేసులు లేని జిల్లాలను ఆరెంజ్ - గ్రీన్ జోన్లుగా మార్చమని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అలా ప్రకటించడంలో జాప్యం జరుగుతుంది. పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి రాగానే జాప్యం లేకుండా జోన్ల మార్పు జరగాలన్నారు కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story