రాష్ట్రంలో వ్యవసాయ విధానంపై కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రంలో వ్యవసాయ విధానంపై కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్

నియంత్రిత పంటల విధానం అంటే బ్రహ్మ పదార్థం కాదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎక్కడ, ఎప్పుడు, ఏ పంట, ఎంత విస్తీర్ణంలో వేస్తే లాభదాయకంగా ఉంటుందో చెప్పేదే ఈ విధానమని అన్నారు. మంచి దిగుబడి వచ్చే పంటలను మన శాస్త్రవేత్తలు సూచిస్తారని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ విధానంపై కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది 79 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశామని.. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటిన్నర ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు.

ఈ వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని రైతులకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు వర్తించదని తేల్చిచెప్పారు. కావాలంటే యాసంగిలో మొక్కజొన్న వేసుకోవచ్చని అన్నారు. ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాలలో మిర్చి.. కూరగాయలు.. సోయా.. పప్పు ధాన్యాలు వంటి ఇతర పంటలు వేయాలని సూచించారు. పూర్తిగా వరి పంట వేస్తే.. నాలుగున్నర కోట్ల టన్నుల వరి దిగుబడి వస్తుందని.. అంత పెద్ద మొత్తంలో వరి వస్తే.. తట్టుకునే శక్తి, బియ్యం తయారు చేయగల శక్తి మన దగ్గర ఉన్న రైస్ మిల్లర్లకు లేదన్నారు. మన మిల్లర్లు కోటి 75 లక్షల టన్నుల వరి మాత్రమే మిల్లింగ్ చేస్తారని స్పష్టం చేశారు. కనుక పంటలు వేసే ముందు లాభసాటి అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్.

మన రాష్ట్రంలో ఎకరా పత్తి వేస్తే దాదాపు 50 వేల రూపాయల లాభం వస్తుందని.. అదేవిధంగా ఒక ఎకరాలో వరి పంట వేస్తే 25 వేల రూపాయల గరిష్టంగా మిగులుతుందన్నారు కేసీఆర్. కనుక పత్తి పంటలో అధిక లాభాలను గడించవచ్చని తెలిపారు. గత ఏడాది 53 లక్షల ఎకరాలలో పత్తి పంట వేశామని.. ఈసారి 70 లక్షల ఎకరాల దాకా పత్తి సాగు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే 40 లక్షల ఎకరాలలో వరి సాగు చేయవచ్చని.. ఇందులో దొడ్డు రకాలు, సన్న రకాల ధాన్యం సాగు గురించి అధికారులు నిర్ణయిస్తారని అన్నారు. అంతేకాకుండా, 12 లక్షల ఎకరాలలో కంది పంట సాగు చేయాలని.. కందులను రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ ఏడాది కరోనా వల్ల వరి ధాన్యాన్ని కొన్నామని.. కానీ, పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదన్నారు కేసీఆర్. ఇప్పుడు రైతులంతా విడిపోయి ఉన్నారని.. కానీ సంఘటితం అయితే దేనినైనా సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 15 రోజులలో ప్రతి జిల్లా అధికారులు వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేస్తారని తెలిపారు. ప్రతి మండలంలోనూ పంటలు సాగు చేసేందుకు యాంత్రిక శక్తి ఎంత అవసరమనే లెక్క మండల వ్యవసాయ అధికారి వద్ద ఉండాలన్నారు సీఎం కేసీఆర్. రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుందని.. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story