పోలీస్ భర్త కట్నం వేధింపులు భరించలేక భార్య..

పోలీస్ భర్త కట్నం వేధింపులు భరించలేక భార్య..

పోలీస్.. అయితేనేం కట్నం కోసం వేధించాడు.. భార్యని కాటికి పంపించాడు. పెళ్లి సమయంలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని రోజూ ఆ పోలీస్ భర్త.. భార్యని వేధించేవాడు. దాంతో ఆమె వేధింపులు తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరణించింది. కర్ణాటక రాష్ట్రం హెబ్బాలు గ్రామానికి చెందిన భారతికి డిఏఆర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లప్పుడు కట్న కానుకల కింద 200 గ్రాముల బంగారం, రూ.3 లక్షల నగదు, ఒక బైకు ఇచ్చారు.

ఇంటి స్థలం కూడా ఇస్తామని అత్త మామలు హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సారాలు వారి కాపురం కలతలు లేకుండానే సాగింది. కానీ ఈ మధ్య స్థలం రాసివ్వమని ప్రతి రోజు భార్యని వేధించేవాడు. ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు కొద్ది రోజుల్లో ఇస్తామని నచ్చజెప్పి పంపించారు. కానీ శ్రీధర్ ఇదే విషయమై భార్యతో రోజూ గొడవపడేవాడు. దీంతో విరక్తి చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు శ్రీధర్‌పైన ఫిర్యాదు చేయడంతో కేఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story