విద్యుత్ చట్టంపై ప్రధానికి.. సీఎం కేసీఆర్ లేఖ
విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిన విద్యుత్ షవరణ బిల్లుపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇది ఎంత మాత్రం ప్రజోపయోగం కాదన్నారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ లేఖలో డిమాండ్ చేశారు. ప్రతిపాదిత బిల్లులో విద్యుత్ బిల్లులను సబ్సిడీ లేకుండా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని, ఇది ప్రజలపై భారం వేయడమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వమే ఈ సబ్సిడీ భరిస్తోందని చెప్పారు. ఈ బిల్లులో డీబీటీ విధానం ఉందని.. ఇది రాష్ట్రాలకు ఏమాత్రం అంగీకారం కాదని ప్రధానికి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com