ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే... ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారో ?- లోకేశ్
ఏపీలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కరోనా అంటే ప్రభుత్వానికి పిల్లలాట అయిపోయిందని అన్నారు. సీఎం జగన్ గారు పారాసెటమాల్ మాటలు చెప్పినట్లే యంత్రాంగం ఆషామాషీగా టెస్టులు చేస్తోందా అనే అనుమానం వస్తోందని అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైరస్ పరీక్షల్లో నిర్లక్ష్యం తగదని చెప్పారు..
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్కు రమ్మని హడావుడి చేశారని అన్నారు. అదే హైదరాబాద్లో రెండుసార్లు పరీక్ష చేసుకుంటే నెగిటివ్ వచ్చిందని గుర్తుచేశారు. ఒక ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే, ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారో అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన టెస్టుల్లో ఏమిటీ నిర్లక్ష్యం అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు లోకేశ్ . పాజిటివ్ అని నిర్ధారణ చేసుకోకుండా దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో పెట్టడానికి చేసిన హడావిడి చూస్తే.. ప్రభుత్వం ఇంకేదైనా కుట్ర చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయని అన్నారు.. ఏది ఏమైనా కరోనా పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందే అని అన్నారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పరీక్ష ఫలితాలను ట్వీట్లో జోడించారు లోకేష్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com