కాశ్మీర్ లో వేర్పాటువాద నాయకుడు అష్రఫ్ సెహ్రాయ్ అరెస్ట్
కాశ్మీర్ లో వేర్పాటువాద నాయకుడు, తెహ్రీక్-ఎ-హురియత్ (టీహెచ్) చైర్మన్ అష్రఫ్ సెహ్రాయ్ను ఆదివారం అరెస్టు చేశారు. అతనిపై ప్రజా భద్రతా చట్టం (పిఎస్ఎ) కింద కేసు నమోదైంది. గతేడాది ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేసిన సమయంలో ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసు డిజిపి దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ, షెహ్రాయ్తో పాటు, నిషేధిత సంస్థ జమాత్-ఇ-ఇస్లామిలోని 12 మందికి పైగా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.
షెహ్రాయ్ కుమారుడు జునైద్ షహ్రాయ్ హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థకు కమాండర్ గా ఉన్నాడు. ఈ ఏడాది మేలో శ్రీనగర్లోని నవకాదల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు అతన్ని హతమార్చాయి.
కాగా అంతకుముందు తెహ్రీక్-ఎ-హురియత్ అధ్యక్షుడిగా ఉన్న సయ్యద్ అలీ షా గీలానీ జూన్ 29 న ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ (ఎపిహెచ్సి) కు రాజీనామా చేశారు. గిలానీ రాజీనామా అనంతరం టీహెచ్.. షెహ్రాయ్ చేతుల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం, ఈ పార్టీలో కాశ్మీర్లోని 26 వేర్పాటువాద ఉప పార్టీలు ఉన్నాయి. హురియత్ను కాశ్మీర్లో రెండు పార్టీలుగా విభజించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com