అందువల్లే 'కియా' వచ్చింది : అచ్చెన్నాయుడు
ఏపీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే.. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది తెలుగుదేశం. తిరస్కరించిన స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పోలవరంపై మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్ట్ అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప.. చేసిందేమీలేదని విమర్శించారు. అధికార పార్టీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. తమ హయాంలోనే పోలవరాన్ని 70 శాతానికి పైగా పూర్తి చేశామని అన్నారు. భూసేకరణ చట్టం వచ్చాకే పరిహారం భారీగా పెరిగిందన్నారు టీడీపీ అధినేత.
అవినీతి కోసమే పోలవరం అంచనాలు పెంచామని ఆరోపిస్తోన్న వైసీపీ...16 వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రానికి లేఖ రాయగలదా అని సవాల్ విసిరారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నిరంతరం శ్రమించానన్నారు చంద్రబాబు. సౌత్ కొరియా ప్రతినిధులతో చర్చలు జరపడం వల్లే కియా వచ్చిందన్నారు. తమపై బురద చల్లడం సరికాదన్న చంద్రబాబు.. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.
దివంగత వైఎస్సార్ విన్నపంతోనే కియా మోటార్స్ తన మొదటి ప్లాంట్ను ఏపీలో పెట్టిందన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. ఈ మేరకు ఆ సంస్థ సీఎం జగన్కు లేఖ రాసిందని చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటనపైనా విమర్శలు చేశారాయన.. బడ్జెట్పై చర్చ తర్వాత...డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com