పోలవరం నిధులకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం

పోలవరం నిధులకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం

సవరించిన పోలవరం అంచనా వ్యయానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఆమేరకు రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.55 వేల 548 కోట్లుగా సవరించిన ఒప్పందాలకు కేంద్ర జలశక్తిశాఖ సలహాసంఘం ఆమోదించింది.. 2017-18 ధరలకు అనుగుణంగా ఈ మేరకు తుది అంచనాలను ఖరారు చేసినట్టు తెలిపింది. పోలవరంపై రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్‌ లాల్‌ కటారియా రాత పూర్వకంగా జవాబిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. సవరించిన పోలవరం అంచనా వ్యయ ప్రతిపాదనలను జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సలహా సంఘం పరిశీలించిందని పేర్కొన్నారు.

ప్రభుత్వం పంపిణ సవరించిన అంచనా వ్యయం ప్రకారం పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు 4 వేల 318 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు 4వేల 202 కోట్లు, హెడ్‌ వర్క్స్‌కు 9 వేల 734 కోట్లు, పవర్‌ హౌస్‌ పనులకు 4 వేల 124 కోట్లు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు 33 వేల 168 కోట్ల రూపాయలు అంచనా ఖర్చులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు.

2014 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 6వేల 764 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. పనుల నిర్వహణ నిమిత్తం పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, కేంద్ర జల వనరుల సంఘం ఆమోదం మేరకు వీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 2014 మార్చి 31 వరకు చేసిన ఖర్చుకు సంబంధించి ఆడిట్‌ నివేదిక సమర్పించిన తర్వాత మాత్రమే తదుపరి నిధుల విడుదల జరగుతుందని మంత్రి చెప్పారు. పోలవరం పనులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని మంత్రి కటారియా చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story