విద్యార్థినితో లెక్చరర్ మూడోపెళ్లి, షాక్ ఇచ్చిన మొదటి భార్య..
అనంతపురం జిల్లా కదిరిలో నిత్య పెళ్లి కొడుకు లీలలు వెలుగులోకి వచ్చాయి. డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్.. మనసు పడ్డ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం.. ముచ్చట తీరాక మోసం చేసి వదిలేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.. క్లాస్లో ఇంగ్లీష్ పాఠాలు చెప్పే ప్రవీణ్ కుమార్.. ఒంటరిగా ఉండే యువతి కనిపిస్తే చాలు ప్రేమ పాఠాలు చెప్పడం.. అలవాటుగా చేసుకున్నాడు.
ప్రవీణ్కు ఉద్యోగం రాకముందే త్రివేణి అనే మహిళను ప్రేమించి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కదిరి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా 2015లో త్రివేణికి మూడు ముళ్లు వేశాడు. కొద్ది రోజులు వీరి కాపురం సవ్యంగానే సాగినా.. తరువాత కట్నం కోసం ప్రవీణ్తో పాటు అతడి తల్లిదండ్రులు వేధించడం మొదలుపెట్టారు. కట్నం తెస్తే కాని తనతో కాపురం చేసేది లేదంటూ తేల్చి చెప్పి.. త్రివేణిని పుట్టింటికి పంపేశాడు.
తరువాత కొన్ని రోజులకే మదనపల్లికి చెందిన ఒక మహిళను ప్రేమించి మరో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా కొద్ది రోజులకే వదిలేశాడు. తరువాత కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించినట్టు చెప్పి.. మరో పెళ్లికి సిద్దపడ్డడంతో ప్రవీణ్ బాగోతం బయటపడింది.
ముస్లిం యువతి తల్లిదండ్రులు పోలీసులకు ప్రవీణ్ పై అనుమానంతో ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న ప్రవీణ్ కుమార్ని పిలిపించి పోలీసులు మాట్లాడారు. మరో మూడు రోజుల్లో ముస్లిం అమ్మాయిన నిఖా చేసుకుంటానని అందరి ముందు మాటిచ్చాడు. మూడో పెళ్లికి ప్రవీణ్ సిద్ధమయ్యాడని తెలియడంతో త్రివేణి వెంటనే కదిరి పోలీసులను ఆశ్రయించింది. తనకు విడాకులు ఇవ్వకుండానే ప్రవీణ్ మూడో పెళ్లికి సిద్ధపడ్డాడని ఫిర్యాదు చేసింది. తనపై కేసు నమోదు అయ్యిందని తెలియగానే ప్రవీణ్ పరారయ్యాడు. నిత్యపెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com