హాజీపూర్ వరుస హత్యల కేసు.. బయటపడుతోన్న సాక్ష్యాలు

హాజీపూర్ వరుస హత్యల కేసు.. బయటపడుతోన్న సాక్ష్యాలు

హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడి శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారులు మరోసారి విచారించనున్నారు. అతన్ని విచారించేందుకు నల్గొండ జిల్లా కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది… గతంలోనూ శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారులు వారంరోజుల పాటు విచారించారు.. నిందితుని నేర చరిత్రపై అధికారులు ఇంకా ఆరా తీయనున్నారు.

ఇప్పటికే శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారించారు. నిందితుడు పనిచేసిన ప్రదేశాల్లో ఏమైనా నేరాలకు పాల్పడి ఉంటాడనే కోణంలోనూ విచారణ కొనసాగనుంది. శ్రావణిని హత్య చేసి బావిలో పాతిపెట్టే సమయంలో శ్రీనివాస్‌రెడ్డికి ఎవరైనా సహకరించారా అనే అనుమానాలపై కూడా వివరాలను సేకరించనున్నట్టు సమాచారం.

మరోవైపు హాజీపూర్‌లో జరిగిన మారణకాండకు సంబంధించి ఒక్కో సాక్ష్యం బయటపడుతోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ.. ఆధారాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని తడకలమ్మ కుంటలో… మృతురాలు మనీషాకు సంబంధించిన ఆధార్‌ కార్డ్‌ స్వాధీనం చేసుకున్నారు. మనీషాను చంపిన తర్వాత… ఆధార్‌ కార్డుతో పాటు మొబైల్‌ ఫోన్‌ను… తడకలమ్మ కుంటలో పడేశానని పోలీసుల విచారణలో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి చెప్పాడు. దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు వెతకగా.. ఆధార్‌ కార్డు లభ్యమైంది. మొబైల్‌ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story