సైకో ప్రవీణ్ దారుణాలు ఎన్నో..రాత్రిపూట ఆడవాళ్లను..
హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన మానవమృగం, సైకో ప్రవీణ్కు సంబంధించి అనేక జుగుప్సాకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. హాజీపూర్ సైకో శ్రీనివాస్ను మించిపోయేలా ప్రవీణ్ అరాచకాలను చేసినట్టు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. తాజా రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రవీణ్ ఒక సెక్సానియాక్గా మారాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రవీణ్ కదలికలకు సంబంధించిన సీసీ కెమెరా వీడియోలను పోలీసులు సేకరించారు.
ఇంటి ఆరుబయట ఉండే ఆడవాళ్లే ప్రవీణ్ టార్గెట్గా గుర్తించారు. అలా ఒంటరి మహిళలను గుర్తించాక తనతోపాటు తెచ్చుకున్న మత్తు ఇంజెక్షన్ను మహిళలపై స్ప్రే చేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. సైకో ప్రవీణ్ ఫిడోఫిలియా అనే జబ్బుతో బాధపడుతున్నాడని రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. ఆరుబయట అరేసిన మహిళల వస్త్రాల వాసనను చూసేవాడని తెలిపారు. గత మూడేళ్లుగా రాత్రిపూట ఆడవాళ్ల కోసం సైకో ప్రవీణ్ వేట సాగించేవాడని పేర్కొన్నారు పోలీసులు.
ప్రజాగ్రహం పెల్లుబకడంతో ఈ కేసు విచారణను హన్మకొండ పోలీసులు వేగవంతం చేశారు. విచారణ అధికారి ఏసీపీ శ్రీధర్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా పోలీసులు సాక్ష్యాలను తయారు చేస్తున్నారు. ఘటనాస్థలంలో సీసీ కెమెరాలలో నమోదైన దృశ్యాలు దర్యాప్తులో కీలకం కానున్నాయి. ఈ దృశ్యాల స్పష్టత కోసం పోలీసులు హైదరాబాద్కు పంపించారు. నిందితుడికి సంబంధించిన DNA పరీక్షలను నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నిందుతుడి తరపున వాదించబోమని న్యాయవాదులు తేల్చిచెప్పడంతో... అన్నిదారులు మూసుకుపోయాయి. సైకో ప్రవీణ్ను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com