సీఎం కాన్వాయ్ ముందు జైశ్రీరామ్ నినాదాలు.. ఆగ్రహంతో కారు దిగిన సీఎం..
ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇటీవల నార్త్ 24 పరాగణాల జిల్లాలోని భాత్పరా ప్రాంతంలో కొంతమంది బీజేపీ శ్రేణులు మమతా బెనర్జీ కాన్వాయ్ ముందుకు వచ్చి జైశ్రీరామ్ అని నినాదాలు చేయడంతో ఆమె మండిపడింది. వెంటనే కారును నిలిపివేసి, కిందికి దిగి తీవ్రస్వరంతో వారిని హెచ్చరిస్తూ అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ తీరుకు నిరసనగా జైశ్రీరామ్ నినాదంతో ఆమెకు 10 లక్షల పోస్టు కార్డులు పంపాలని బీజేపీ సిద్ధమైంది.
అయితే, బీజేపీ నేతల యోచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు ప్రతీకారంగా అన్నట్లు వారు ప్రధాని నరేంద్ర మోదీకి జైహింద్, వందేమాతరం, జై బంగ్లా అని నినాదాలు రాసిన 10 వేల పోస్టుకార్డులు పంపారు. బీజేపీ కార్యకర్తలు ఓ సీఎం కారు ముందుకు వచ్చి జైశ్రీరామ్ నినాదాలు చేయవచ్చా.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఒక్క సీఎం కాన్వాయ్ మాత్రమే కాదు వారు తమ ఎమ్మెల్యేల, ఎంపీల దగ్గర కూడా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. కానీ తాము ఎప్పుడూ ఇలాంటి తప్పుడు చర్యలు చేయమని.. ప్రధాని కాన్వాయ్ కి అడ్డుపడమన్నారు. కేవలం బీజేపీ శ్రేణుల తీరుకు నిరసన గానే మేము కూడా 10,000 పోస్టులు ప్రధానికి పంపామని ఆయన అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com