క్యాన్సర్ ఉందంటూ కీమో చేసి.. చివరికి..

క్యాన్సర్ ఉందంటూ కీమో చేసి.. చివరికి..

మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుతుంటారు డాక్టర్లు. హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న ల్యాబ్‌ల్లో టెస్టులు చేయించుకుంటే కూడా తప్పుడు రిపోర్టు ఇచ్చి ఓ మహిళకు క్యాన్సర్ లేకపోయినా ఉందని కీమో ట్రీట్ మెంట్ చేశారు. ఈ దారుణ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటు చేసుకుంది. అలప్పుజ జిల్లాలోని కుదస్సానంద్‌కి చెందిన రజనీ అనే మహిళ సేల్స్ గర్ల్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. భర్త లేకపోవడంతో 8 ఏళ్ల కూతురితో పాటు వయసు మీదపడిన తల్లిదండ్రుల బాధ్యతను కూడా ఆమే చూసుకోవలసి వచ్చేది. ఈ మధ్య ఆరోగ్యం బావుండకపోవడంతో రజని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. రజనీని పరీక్షించిన వైద్యులు ఆమెకు రొమ్ము క్యాన్సర్ అనే అనుమానం వ్యక్తం చేశారు. బయాప్సీ కోసం రెండు శాంపిల్స్‌ని సేకరించిన డాక్టర్లు.. ఒకటి హాస్పిటల్ ల్యాబ్‌కి పంపించగా.. మరొకటి ప్రైవేట్ ల్యాబ్‌కి పంపించారు.

ముందుగా ప్రవైట్ ల్యాబ్ రిపోర్ట్ రావడంతో అందులో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలడంతో కీమో థెరపీ మొదలు పెట్టారు రజనీకి డాక్టర్లు. ఈ క్రమంలో ఆమె జుట్టంతా ఊడిపోయింది. మార్చి 9న మొదటి కీమో నిర్వహించిన డాక్టర్లు.. ఏప్రిల్ 9న మరోసారి కీమో చేస్తామని చెప్పారు. ఈలోపు ఎంసీహెచ్‌కి పంపించిన బయాప్సీ రిపోర్టు వచ్చింది. ఆమె కడుపులో పెరుగుతున్న గడ్డ క్యాన్సర్ కణితి కాదని తేలింది. దీంతో రజనీకి ఇచ్చే క్యాన్సర్ మందులను, కీమో థెరపీని డాక్టర్లు వెంటనే ఆపేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆమె హాస్పిటల్ సూపరింటెండెట్‌కు లేఖ రాశారు. స్పందించిన డాక్టర్లు సర్జరీ చేసి కణితిని తొలగించారు. కీమో కారణంగా నీరసించిన ఆమె పనికి వెళ్లలేకపోతోంది. ఈ వార్తపై కేరళ ఆరోగ్య మంత్రి స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story