కృష్ణాబేసిన్‌లో జలజాతర.. సుదీర్ఘకాలం తర్వాత..

కృష్ణాబేసిన్‌లో జలజాతర.. సుదీర్ఘకాలం తర్వాత..

కృష్ణాబేసిన్‌లో జలజాతర కొనసాగుతోంది. ఆల్మట్టి మొదలు దిగువన పులిచింతలవరకు కృష్ణానదిలో లక్షల క్యూసెక్కులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపుర జలాశయాలకు వరద స్థిరంగా కొనసాగుతుండగా.. దిగువన శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు జోరుగా వరద పోటెత్తుతోంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులనుంచి భారీస్థాయిలో జలాలను విడుదలచేస్తున్నారు. నాగార్జునసాగర్ మొత్తం 26 గేట్లను 27 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదలచేస్తుండటంతో కృష్ణమ్మ గర్జిస్తూ కిందికి దూకుతోంది. అటు ఈ నీటితో పులిచింతలలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతుండటంతో అక్కడకూడా నీటివిడుదల సామర్థ్యాన్ని పెంచారు. దీంతో గత రెండ్రోజులుగా సముద్రంలో కలుస్తున్న కృష్ణాజలాల పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి జూరాల వరకు కొనసాగుతున్న వరదతో మరో మూడునాలుగు రోజులవరకు నాగార్జునసాగర్‌కు సుమారు ఐదారు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు లక్షల క్యూసెక్కులకుపైగా వరద స్థిరంగా వస్తోంది. కొన్నిరోజుల కిందటివరకు భారీవరద నేపథ్యంలో జలాశయం నీటిమట్టాన్ని తగ్గించిన కర్ణాటక అధికారులు.. ప్రస్తుతం వరద తగ్గటంతో నిల్వస్థాయిని పెంచుతూనే దిగువకు సరాసరి 5 లక్షల క్యూసెక్కులు విడుదలచేస్తున్నారు. నారాయణపుర జలాశయం వద్ద కూడా మంగళవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 6 లక్షల క్యూసెక్కుల స్థాయిలో స్థిరంగా కొనసాగింది. అధికారులు నెమ్మదిగా జలాశయంలో నీటిమట్టాన్ని పెంచుతూ.. దిగువకు స్థిరంగా 5.94 లక్షల క్యూసెక్కులను విడుదలచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంట ల సమయానికి ఉజ్జయినికి వరద సుమారు 22 వేల క్యూసెక్కులకు తగ్గడంతో అధికారులు అవుట్‌ఫ్లోను దాదాపు 11 వేల క్యూసెక్కులకు కుదించారు. దీంతో జూరాల జలాశయానికి స్వల్పంగా వరద తగ్గటంతో ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 7.26 లక్షల క్యూసెక్కులుగా, అవుట్‌ఫ్లో 7.17 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది

తుంగభద్ర అవుట్‌ఫ్లో తగ్గినా.. రెండ్రోజులపాటు వదిలిన రెండు లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద జలాలు శ్రీశైలానికి చేరుకుంటున్నాయి. ఫలితంగా మంగళవారం జూరాల నుంచి వరద స్థిరంగా ఉన్నా.. శ్రీశైలానికి రాత్రి 11 గంటల సమయానికి 8.66 లక్షల క్యూసెక్కుల పైచిలుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులు పది గేట్లను 42 అడుగుల మేర ఎత్తి దిగువకు 8.90 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 6 యూనిట్లలో 900 మెగావాట్ల కరంటు ఉత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కరంటు ఉత్పత్తి చేసి, 30,143 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదను నియంత్రించడంలో భాగంగా నాగార్జునసాగర్ జలాశయంలో ఒకవైపు నీటిమట్టాన్ని క్రమంగా పెంచుతూనే దిగువకు అవుట్‌ఫ్లోను కూడా అధికారులు పెంచారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు 246.54 టీఎంసీలుగా ఉన్న నీటినిల్వను మంగళవారం రాత్రి పదిగంటలకు సుమారు 273 టీఎంసీలకు పెంచారు. మరోవైపు అవుట్‌ఫ్లోను కూడా ఐదున్నర లక్షల క్యూసెక్కులకుపైగా పెంచారు. ప్రాజెక్టులోని మొత్తం 26 గేట్లను 27 అడుగుల మేర ఎత్తి నీటిని భారీగా విడుదలచేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.

నాగార్జునసాగర్ నుంచి భారీస్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగుతుండటంతో పులిచింతల జలాశయంలో సుదీర్ఘకాలం తర్వాత జలసవ్వడి వినిపిస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి పులిచింతలకు 5.80 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా.. దిగువకు 4.22 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ప్రకాశం బరాజ్ మీదుగా కృష్ణమ్మ కడలివైపు పరవళ్లు తొక్కుతున్నది. పదేండ్ల తర్వాత ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ స్థాయిలో ఇన్‌ఫ్లో నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story