విజృంభిస్తున్న విష సర్పాలు.. ఈ జాగ్రత్తలు పాటించాలి..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విష సర్పాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పాము కాటు బాధితులు, మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పాము కాటుతో భార్య, భర్తతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాము కాట్లతో వరుసగా మృతి చెందడంతో స్థానిక గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పలువురు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. పాము కుట్టిన వెంటనే సకాలంలో ఆస్పత్రికి తీసుకురాకపోవడం, మూఢాచారాలతో మంత్రాలు, నాటు వైద్యాన్ని ఆశ్రయించడంతో మృతుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
వరంగల్ ఎంజీఎంలో పాము కాటు మందులు లభిస్తున్నాయని.. మిగత గ్రామీణ ఆస్పత్రుల్లో కూడా మందులు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత అక్కడి వైద్యులపై ఉందని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు సూచిస్తున్నారు. పాము కరిచిన వెంటనే ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయటపడవచ్చన్నారు ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు, మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ చంద్రశేఖర్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com