ఆ ఐదుగురుని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ

ఆ ఐదుగురుని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ

మ‌సూద్ అజ‌ర్‌, హ‌ఫీజ్ స‌యీద్‌, దావూద్ ఇబ్ర‌హీం, జ‌కీ ఉర్ రెహ్మాన్ ల‌ఖ్వీల‌ను ఉగ్ర‌వాదులుగా ప్రకటించింది కేంద్ర హోంశాఖ. కొత్త‌గా స‌వ‌రించిన యూఏపీఏ చ‌ట్టం కింద వీరిని టెర్రరిస్టులుగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ గెజిట్‌ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ‌మ్మ‌ద్‌ వ్య‌వ‌స్థాప‌కుడు మౌలానా మ‌సూద్ అజ‌ర్ అని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల చ‌ట్టంలోని తొలి షెడ్యూల్ ప్ర‌కారం జైషే సంస్థపై నిషేధం ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

అజ‌ర్ నేతృత్వంలోని జైషే సంస్థ భారీ స్థాయిలో ఉగ్ర‌వాదుల రిక్రూట్మెంట్ నిర్వ‌హిస్తోంద‌ని కేంద్రం వెల్లడించింది. అజ‌ర్‌పై అనేక కేసులు ఉన్నాయ‌ని, ఎన్ఐఏ లాంటి సంస్థ‌లు ఆ కేసుల‌ను ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపింది. అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంను సైతం ఉగ్ర‌వాదిగా ప్రకటించింది కేంద్రం. ఇప్ప‌టికే ఐక్య‌రాజ్య‌స‌మితి అతన్ని గ్లోబ‌ల్ టెర్ర‌రిస్టుగా ముద్ర వేసింద‌న్న కేంద్ర హోంశాఖ.. ఇప్పుడు యూఏపీఏ చ‌ట్టం కింద కూడా అత‌న్ని ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వెల్లడించింది.

ఇక.. ల‌ష్క‌రే తోయిబాకు చెందిన హ‌ఫీజ్ స‌యీద్‌పైన కూడా నాలుగు కేసులు ఉన్నాయి. ఎర్ర‌కోట‌పై దాడి, రాంపూర్ అటాక్‌, ముంబై దాడులు, ఉదంపూర్‌లో బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై దాడి.. ఇలా పలు కేసుల‌ు హ‌ఫీజ్‌పై న‌మోదు అయ్యాయి. అటు జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీని సైతం ఉగ్రవాదిగా ప్రకటించింది హోంశాఖ.

Tags

Read MoreRead Less
Next Story