కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వివాదం కలకలం
కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వివాదం కలకలం రేపుతోంది. కుమారస్వామి ప్రభుత్వ హయాంలో.. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లోని ఏడీజీపి ర్యాంక్కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి.. కొందరు ఇన్స్పెక్టర్ సాయంతో దాదాపు 185 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ నేతలతో పాటు జర్నలిస్ట్లు, పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను ఈ టీం ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. వీరి ప్రైవేట్ సంభాషణలను రికార్డు చేశారని, ఈ సమాచారాన్ని పెన్ డ్రైవ్లో తీసుకున్నారని, దీన్ని ఏడీజీపీ ర్యాంక్ ఆఫీసర్కు ఇచ్చినట్లు వివాదం తలెత్తుతోంది.
లోక్సభ ఎన్నికల సమయంలో ఈ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ట్యాప్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్ భాస్కర్రావుకు.. ఆ రాష్ట్ర డీజీపీ నీలమణి రాజు ఆదేశించారు.
రాజకీయ కారణాలతోనే ఫోన్లను ట్యాపింగ్ చేశారంటున్నారు బీజేపీ నేతలు. కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మండిపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరమంటున్న బీజేపీ నేతలు.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని జేడీఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. కుమారస్వామి ఎప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించలేదంటున్నారు.
Also Watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com