అమ్మకు బై చెప్పి బడికెళ్లాడు.. అంతలోనే మృత్యువు..

అమ్మకు బై చెప్పి బడికెళ్లాడు.. అంతలోనే మృత్యువు..

మృత్యువు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. ఆడుతూ, పాడుతూ అమ్మ తినిపించే గోరుముద్దలు తింటూ స్కూలుకు వెళ్లే చిన్నారిని మృత్యువు తన ఒడికి చేర్చుకుంది. అమ్మకు తీరని వేదన మిగిల్చింది. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం చెన్నూరు గ్రామానికి చెందిన సురేందర్, రేణుక దంపతులకు శ్రేయాస్ (8), లోక్షిత (6) సంతానం. బడంగ్‌పేటలోని ఆశంగారి రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు. స్థానికంగా ఉన్న దిల్‌సుఖ్‌నగర్ పబ్లిక్ స్కూల్లో శ్రేయాస్ 3, లోక్షిత 1వ తరగతి చదువుతున్నారు. పిల్లలిద్దరినీ రోజు మామయ్య బాలకృష్ణ కానీ, తండ్రి కానీ స్కూలుకి తీసుకువెళతారు బండిమీద. ఈ క్రమంలో సోమవారం బాలకృష్ణ బండి మీద పిల్లలిద్దరినీ తీసుకుని వెళుతున్నాడు. ఇంటి దగ్గర అమ్మకు టాటా చెప్పి శ్రేయాస్, లోక్షిత బండి ఎక్కారు.

పాఠశాలకు వస్తున్న క్రమంలో పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ పక్కనే మలుపు వద్ద ఎదురుగా వచ్చిన లార్డ్స్ పాఠశాల బస్సు వీళ్లు వస్తున్న బైక్‌కు తగిలింది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోగా.. బస్సు చక్రాలు బాలకృష్ణ తల పైనుంచి , శ్రేయాస్ పై నుంచి వెళ్లాయి. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లోక్షిత స్వల్స గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ బస్సుతో సహా పారిపోయాడు. బిడ్డ మరణ వార్తను తెలుసుకున్న తల్లి రేణుక ఘటనాస్థలికి చేరుకుని భోరున విలపించింది. శ్రేయాస్‌ను ఒడిలోకి తీసుకుని కన్నీరు మున్నీరవుతోంది. కొత్తగా కొనుక్కున్న ఫొనులో చిన్నారుల ఫోటోలను నిన్ననే తీశానని అందరికీ చూపిస్తూ రోదించడం అక్కడున్న అందరి హృదయాలను కలిచివేసింది.

Tags

Read MoreRead Less
Next Story