హర్షించిన బాలీవుడ్.. ఆయనో దార్శనికుడంటూ పొగడ్తలు

హర్షించిన బాలీవుడ్.. ఆయనో దార్శనికుడంటూ పొగడ్తలు

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్రం రద్దు చేయడాన్ని బాలీవుడ్‌ స్వాగతించింది. సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై బాలీవుడ్‌ నటీనటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోదీ సర్కారు నిర్ణయానికి మద్దతుగా సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఈ నిర్ణయం చారిత్రక నిర్ణయమన్నారు హీరోయిన కంగనా రనౌత్‌. ఇది ఉగ్రవాద నిర్మూలనకు ఉపయోగపడుతుందని...ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ప్రధాని మోదీ మాత్రమే తీసుకోగలరని ప్రశంసించారు. ఆయన దార్శనికుడు మాత్రమే కాదని.. చాలా ధైర్యవంతుడైన నాయకుడని కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తివంతుడని పొగడ్తలతో ముంచెత్తిన కంగనా... జమ్మూ కశ్మీర్‌కు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.....

కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం మొదలైందని సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ట్వీట్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతి నెలకొనాలని నటి దియా మిర్జా ఆకాంక్షించారు. జమ్మూ కశ్మీర్‌లో అందరూ క్షేమంగా ఉండాలని నటుడు సంజయ్‌ సూరి కోరుకున్నారు. కేంద్రం నిర్ణయానికి మద్దతుగా రవీనా టాండన్‌ జాతీయ పతాకాలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

మన మాతృభూమికి పరిపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిందంటూ విలక్షణ నటుడు పరేశ్‌ రావల్‌ ట్వీట్‌ చేశారు. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించారాయన. ఆర్టికల్‌ 370 రద్దును విప్లవాత్మక నిర్ణయంగా నిర్మాత ఏక్తాకపూర్‌ వర్ణించారు. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యునైటైడ్‌ ఇండియా కల సాకారం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ఇది ఘనమైన నివాళిగా హీరో వివేక్‌ ఒబరాయ్‌ పేర్కొన్నారు. ప్రతి దేశభక్తుడు మోదీ, అమిత్‌ షాలకు కృతజ్ఞతలు చెబుతున్నారని ట్వీట్‌ చేశారు.

మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయానికి బాలీవుడ్ నుంచి భారీ మద్ధతు లభిస్తోంది. ‌పరిశ్రమలోని అనేక మంది నటీనటులు... ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story