ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం
ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ ధర్మేష్ శర్మ, ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రోడ్డు యాక్సిడెంట్లో బాధితురాలు తీవ్రంగా గాయపడడంతో ఆమెకు ఎయిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్యబృందం ట్రీట్మెంట్తో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఐతే, ఆమె విచారణకు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్లోనే తాత్కాలిక కోర్టు ఏర్పాటు చేశారు. ఎయిమ్స్లోనే బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేయాలని, వాంగ్మూలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వొద్దని కోర్టు ఆదేశించింది. దాంతో స్టేట్మెంట్ రికార్డ్ సమయంలో మీడియాను అనుమతించలేదు. ఆడియో, వీడియో రికార్డింగ్కు కూడా అనుమతివ్వలేదు. తాత్కాలిక కోర్టు ఏర్పాటు చేసిన సెమినార్ హాల్లోని సీసీటీవీ కెమెరాలను కూడా స్విచ్ఛాప్ చేశారు.
2017లో ఉన్నావ్ రేప్ కేసు వెలుగుచూసింది. ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సరిగా పట్టించుకోకపోవడంతో యూపీ సీఎం ఇంటి వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దాంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఇటీవల బాధితురాలు కారులో వెళ్తుండగా ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విక్టిమ్ బంధువులు చనిపోయారు. ఈ ప్రమాదం వెనక ఎమ్మెల్యే హస్తముందని బాధితురాలు ఆరోపించింది.
Also watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com