అంచనాలకు తగ్గట్టే సాగుతోన్న టీమిండియా

అంచనాలకు తగ్గట్టే సాగుతోన్న టీమిండియా

అంచనాలకు తగ్గట్టే సాగుతోన్న టీమిండియా వరల్డ్‌కప్ ప్రయాణంలో మూడో మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలపై విజయాలతో దూసుకెళుతోన్న భారత్ నాటింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలుపుతో కోహ్లీసేన కాన్ఫిడెన్స్ రెట్టింపయింది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించి కంగారూలను నిలువరించింది. దీంతో వరల్డ్‌కప్ రేసులో పెద్ద అడ్డంకిని అధిగమించినట్టైంది. అయితే ఆసీస్‌పై సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో మూడు వారాలు దూరమవడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఇప్పుడు కివీస్‌పై రోహిత్‌శర్మకు తోడుగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్‌గా కెఎల్ రాహుల్‌నే పంపిస్తారని భావిస్తుండగా... నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. ధావన్‌ గాయంపై బీసిసిఐ వేచిచూడాలని నిర్ణయించడంతో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు. మిగిలిన టీమ్ పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులూ లేవు. గత మ్యాచ్‌లో కోహ్లీ, హార్థిక్ పాండ్యా కూడా సత్తా చాటడంతోనే భారీస్కోర్ సాధ్యమైంది.

అటు బౌలింగ్ పరంగానూ టీమిండియా మంచి ఫామ్‌లో ఉంది. గత మ్యాచ్‌లో పేసర్లు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సక్సెసయ్యారు. మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్లు పుంజుకోగా... చివర్లోనూ పేసర్లదే పైచేయిగా నిలిచింది. దీంతో కివీస్‌పై కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. అయితే ఆ జట్టు సాధించిన మూడు విజయాలూ చిన్న జట్లపై వచ్చినవే. ఈ నేపథ్యంలో టీమిండియాతో పోరు కివీస్‌కు కఠిన పరీకగానే చెప్పాలి. పలువురు సీనియర్ ఆటగాళ్ళతో పాటు ఆల్‌రౌండర్లు న్యూడిలాండ్‌కు బలం. అయితే వార్మప్ మ్యాచ్‌లో భారత్‌పై గెలిచి ఉండడం కివీస్‌కు అడ్వాంటేజ్‌. ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే కోహ్లీసేనను నిలువరించాలంటే ఆ జట్టు అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. కాగా ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు వర్షంతో రద్దవడం అభిమానులకు నిరాశను కలిగించింది. దీంతో భారత్‌,కివీస్ పోరు సజావుగా సాగాలని వారు కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లూ చెరొక పాయింట్‌ పంచుకోక తప్పదు.

Read MoreRead Less
Next Story