చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించి..

చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించి..

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలుగుతేజం పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో తనకంటే మెరుగైన ప్రత్యర్థి అయిన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌, చైనా షట్లర్ చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించింది. 21-19, 21-10 తేడాతో యుఫీని మట్టికరిపించిన సింధూ తొలిసారి ఇండోనేషియా ఓపెన్‌ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది.

మ్యాచ్‌ను చైనా షట్లర్‌ ధాటిగా ఆరంభించి.. మొదటి గేమ్‌లో 4-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. తర్వాత దూకుడు మరింత పెంచి అటాకింగ్‌ గేమ్‌తో మొదటి సెట్‌ను 21-19తో కైవసం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వని సింధూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బ్రేక్‌ సమయానికి సింధుకు కీలకమైన మూడు పాయింట్ల ఆధిక్యం దక్కింది.. కచ్చితమైన షాట్‌తో సింధు 21-10 తేడాతో గేమ్‌తోపాటు మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకుంది.. దీంతో భారత్‌కు రజత పతకం ఖాయం చేసింది.

ఈ ఏడాది సింగపూర్‌, ఇండియా ఓపెన్‌లో సెమీస్‌తోనే సరిపెట్టుకున్న సింధు ఈసారి ఫైనల్‌ చేరి సత్తా చాటింది.. ఈరోజు జరిగే ఫైనల్‌లో జపాన్‌ స్టార్‌ ప్లేయర్‌ యమగుచితో తలపడనుంది. అయితే, యమగుచిపై సింధుకు మెరుగైన రికార్డు ఉంది.. ఈమెతో ముఖాముఖి పోరులో 10-4తో ఆధిక్యంలో ఉంది.. ఫైనల్‌లో ఇదే జోరు కొనసాగిస్తే టైటిల్‌ తనఖాతాలో వేసుకోవడం ఖాయం. అటు సింధు ఫైనల్‌కు చేరడంపై భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య ట్విట్టర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది.. ఐదో సీడ్‌ సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించాలని బాయ్‌ ఆకాంక్షించింది.

Tags

Read MoreRead Less
Next Story