సెమీస్ చేరుకోబోయే నాలుగో టీం పాకిస్తానేనా?

సెమీస్ చేరుకోబోయే నాలుగో టీం పాకిస్తానేనా?

ప్రపంచకప్ లో లీగ్ మ్యాచులు చివరి దశకు వచ్చేశాయి. సిరీస్ లో పాల్గొంటున్న పది జట్లలో ఒక్కో టీం 9 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, అప్ఘానిస్తాన్ ఇప్పటికే 8 మ్యాచులు ఆడేశాయి. ఇంగ్లండ్, భారత్ తో ఎనిమిదో మ్యాచ్ లో అదృష్టం పరీక్షించుకుంటుంది. మిగిలిన జట్లలో బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టీండీస్ ఏడు మ్యాచులు ఆడాయి. లీగ్ లో భారత్ మినహా టాప్ ఫోర్ జట్లకు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండటంతో వరల్ట్ కప్ రసవత్తరంగా మారింది. పాయింట్ల పట్టికతో లెక్కలు వేసుకుంటూ సెమీస్ కు వెళ్లేదెవరో అంచనాలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఫైనల్ ఫోర్ కు చేరే ఆ నాలుగు జట్లలో టాప్ లో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటికే ప్లేస్ కన్ఫమ్ చేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఓడినా గెలిచానా ఆస్ట్రేలియాకు ఢోకా లేదు. ఇక 11 పాయింట్లతో సెకండ్ ప్లేసులో ఉన్న భారత్ దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నట్లే. ఇక ఇంగ్లండ్ తో గెలిస్తే తిరుగుండదు. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచుల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ ఫైనల్ ఫోర్ కు చేరుకుంటుంది. ఇక పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేసులో న్యూజిలాండ్ కు కూడా సెమీస్ చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడి 5 మ్యాచుల్లో విజయం సాధించింది. భారత్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావటంతో 11 పాయింట్లతో థార్డ్ ప్లేసులో ఉంది. మరో మ్యాచ్ లో ఇంగ్లండ్ తో ఆడాల్సి ఉంది. చివరి మ్యాచ్ లో గెలిస్తే కివీస్ సెమీస్ బెర్త్ కన్ఫమ్ అవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ చివరి రెండు మ్యాచుల్లో గెలిచినా..నాలుగో జట్టుగా సెమీస్ లో చోటు దక్కించుకుంటుంది. అయితే..ప్రస్తుతం మైనస్ లో పాకిస్తాన్ రన్ రేట్ లో ఏమైనా మార్పులోస్తే తప్ప న్యూజిలాండ్ కు కూడా ఢోకా లేదు. ఇక సెమీస్ చేరుకోబోయే నాలుగో జట్టు గణాంకాలు ఆసక్తికరంగా మారాయి. అప్ఘనిస్తాన్ పై చెమటోడ్జి గెలిచిన పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. అయితే.. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. లేదంటే బంగ్లాదేశ్ కు 9 పాయింట్లతో పాకిస్తాన్ సరసన చేరుతుంది. పైగా బంగ్లాదేశ్ కు మరో మ్యాచ్ మిగిలి ఉంది. అలాగే ఇంగ్లాండ్ గెలుపోటములు కూడా పాకిస్తాన్ ఫేట్ మార్చబోతోంది. ఇంగ్లండ్ వరుసగా రెండు మ్యాచులు గెలిస్తే పాక్ ఆట ముగిసినట్టే.

ఇక హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. సిరీస్ ప్రారంభంలో దూకుడు మీదున్న ఆ జట్టు సొంత గడ్డపై అనూహ్యంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. చివరి రెండు మ్యాచుల్లోనూ భారత్, న్యూజిలాండ్ బలమైన జట్లతో ఫైట్ చేయాలి. ఈ రెండు జట్లపై విజయం సాధిస్తే 12 పాయింట్లతో సెమీస్ ప్లేస్ ఫిక్స్ అవుతుంది. ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిస్తే..పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో ఓడిపోతేనే ఇంగ్లండ్ కు అవకాశాలుంటాయి. ఇక దాదాపుగా ఆశలు ఆడియాశలే అయినా బంగ్లాదేశ్, శ్రీలంకకు కూడా ఏదో మూల ఆశలు మిగిలే ఉన్నాయి. బంగ్లాదేశ్ చివరి రెండు మ్యాచులు గెలిచి ఇంగ్లండ్ ఓ మ్యాచ్ ఓడితే ఆ జట్టు సెమీస్ కు చేరుతుంది. అటు శ్రీలంక కూడా అద్భుతాల కోసం ఎదురుచూస్తోంది. పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ ఆన్ని మ్యాచుల్లో ఓడి..శ్రీలంక మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే అప్పుడు సింహాళీ టీంకు అవకాశాలు ఉంటాయి. మ్యాచ్ రద్దు అయి ఒక మ్యాచ్ గెలిచినా రన్ రేట్ మైనస్ లో ఉన్న లంక ఫైనల్ ఫోర్ కు చేరుకోవటం కష్టమే.

Tags

Read MoreRead Less
Next Story