మన మాధురీయే టాపర్
జాతీయ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ అమ్మాయి ఏడో ర్యాంక్, ఏపీకి చెందిన అమ్మాయి 16వ ర్యాంకు సాధించింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల నుంచి 72,083 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సత్తా చాటింది. తెలంగాణకు చెందిన మాధురి రెడ్డి మహిళల్లో టాపర్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 72,083 మంది అర్హత సాధించారు. అమ్మాయిల్లో టాపర్గా నిలిచిన తెలంగాణ విద్యార్థిని జి.మాధురి రెడ్డి 695 మార్కులతో 7వ ర్యాంక్ సాధించింది. ఏపీ అమ్మాయి కురేషే హస్రాకు 16వ ర్యాంకు వచ్చింది. ఏపీ నుంచి 72.55 శాతంతో 39,039 మంది విద్యార్థులు, తెలంగాణ నుంచి 68.88 శాతంతో 33,044 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
నీట్లో రాజస్తాన్కు చెందిన నలిన్ ఖండేల్వాల్ 701 మార్కులతో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఓవరాల్గా చూస్తే.. రాజస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో ర్యాంకులో ఢిల్లీకి చెందిన భావిక్ బన్సాల్, మూడో ర్యాంకులో ఉత్తర్ ప్రదేశ్కు చెందిన అక్షత్ కౌశిక్ నిలిచారు. ఇద్దరూ 700 మార్కులే సాధించారు. మొత్తంగా చూస్తే.. టాప్-100లో మొత్తం 20 మంది అమ్మాయిలు ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 5న నీట్ నిర్వహించారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కనీసం 40 శాతం, దివ్యాంగులకు 45 శాతం పర్సంటైల్ను అర్హత మార్కులుగా నిర్ణయించారు. నీట్ అర్హత తరువాత కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com