ఎత్తిపోతలకు బ్రేక్!
మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తోన్నగుడిపల్లి లిఫ్ట్-3 రిజర్వాయర్లో నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. విద్యుత్ అంతరాయాలు,సాంకేతిక లోపాల కారణంగా నీటి ఎత్తిపోతలకు బ్రేక్ పడింది. గత 15రోజులుగా కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నా చుక్క నీటిని కూడా వాడుకునే పరిస్థితి లేకపోవడంతో నాగర్కర్నూలు ప్రాంత రైతులు ఆవేదనకు గురవుతున్నారు.అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
ఎల్లూరు వద్ద నీటిని ఎత్తిపోస్తూ జొన్నల బోగుడ రిజర్వాయర్ నుంచి గుడిపల్లి గట్టు రిజర్వాయర్లలోకి మూడు లిఫ్ట్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తూ జొన్నల బొగుడ ప్రాతంలోని చెరువులు నింపడం జరిగింది. అయితే..ప్రస్తుతం విద్యుత్ అంతరాయాల పేరుతో గుడిపల్లి గట్టు రిజర్వాయర్లో నుంచి ఒక్క నీటి చుక్కను కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నారు. ఈ కారణంగా ఆ ప్రాంత ఆయకట్టు భూములు బీళ్లుగా మారిపోయాయి. గత 15 రోజుల నుంచి వరద తాకిడితో కృష్ణా నది ఉప్పొంగుతున్నా నీటిని వాడుకునే నిస్సహాయ స్థితిలో ఉండడం నిజంగా దౌర్భాగ్యమే.. అధికారుల నిర్లక్ష్యం వల్లే నీటిని ఎత్తిపోయలేని పరిస్థితిదాపురించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీటిని ఎత్తిపోసే క్రమంలో హైఓల్టేజ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. దీంతో..కృష్ణా జలాలు వృధాగా సముద్రం పాలయ్యాయి. ఈనేపథ్యంలో.. అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com