సంగీత దర్శకుడికి రోడ్డు ప్రమాదం.. కాపాడిన హీరో సాయి ధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్నారు. కళ్ల ముందే ఓ యాక్సిడెంట్.. మరో ఆలోచన లేకుండా మానవత్వం ఉన్న మనిషిగా స్పందించారు. సకాలంలో అతడికి వైద్యం అందేందుకు సాయపడి నిజమైన హీరో అనిపించుకున్నారు సాయి ధరమ్ తేజ్. నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకుని బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ మీదుగా ఇంటికి వెళుతున్నారు . అంతలో రోడ్డు నెం.42 లోని ఓ మూలమలుపు దగ్గర బైక్ పై వస్తున్న ఓ వ్యక్తి అదుపు తప్పి అటుగా వస్తున్న కారును ఢీకొట్టారు. దీంతో బైక్ పై నున్న వ్యక్తి సుమారు 10 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. కళ్ల ముందు జరిగిన ప్రమాదంతో హతాశుడైన సాయి ధరమ్ హుటాహుటిన కారు దిగి యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి దగ్గరకు వెళ్లారు. తరచి చూడగా తనకు తెలిసిన వాడేనని గుర్తించారు. అతడు యువ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి అని తెలుసుకున్నారు. మరో వ్యక్తి సాయంతో తేజ.. బాధితుడిని తన చేతులపై మోసుకొచ్చి తన కారులోనే.. సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో అచ్చు కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అచ్చు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com