ఉగ్రవాదం విషయంలో బరితెగించిన పాకిస్థాన్
ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ బరితెగించింది. టెర్రరిస్టులపై చర్యలు తీసుకోకపోతే నిషేధం తప్పదని FATF చేసిన హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంది. తాజాగా పాకిస్థాన్ గూఢచారి సంస్థ-ISI, ఉగ్రవాద సంస్థలతో సమావేశమైంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఖలిస్థానీ జిందాబాద్ నేతలతో ISI ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఇస్లామాబాద్లోని సైనికాధికారికి చెందిన ఓ రహస్య ప్రదేశంలో ఈ మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆర్టికల్-370 రద్దు తర్వాతి పరిణామాలు, కశ్మీర్ పరిస్థితులపై ఈ మీటింగ్లో చర్చించినట్లు సమాచారం.
భారత్లో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా ISI-టెర్రరిస్టు గ్రూపుల మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తమ తమ అజెండాలతో ముందుకు సాగాలని మీటింగ్లో నిర్ణయించినట్లు సమాచారం. భారీ స్థాయిలో దాడులు చేయాలని, మారణహోమం సృష్టించాలని ISI అధికారులు, ఉగ్రవాద కమాండర్లు నిర్ణయించినట్లు సమాచారం. సైన్యం సహకారంతో కశ్మీర్లోకి చొరబడాలని, అందుకు ISI సాయం తీసుకోవాలని ఉగ్రవాద నాయకులు తీర్మానించారు. ఖలిస్తాన్ మిలిటెం ట్లను కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించారు. అమెరికా, కెనెడా, బ్రిటన్లో ఖలిస్థాన్ మద్ధతుదారులను రెచ్చగొట్టాలని ప్లాన్ చేశారు. ISI-ఉగ్రవాద సంస్థల మీటింగ్పై భారత నిఘా సంస్థలకు పక్కా సమాచారం లభించింది. మీటింగ్ వివరాలను సేకరించిన ఐబీ వర్గాలు, ఆర్మీ, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాయి.
Also watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com