ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పాకిస్థాన్!
ఆర్టికల్ 370 రద్దు, 35 ఏ రద్దు, జమ్మూకశ్మీర్ విభజనతో.. కుతకుతలాడిపోతోన్న పాకిస్థాన్.. సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో అత్యవసరంగా సమావేశమైన జాతీయ భద్రతా కమిటి.. భారత్పై తమకున్న అక్కసును మరోసారి వెళ్లగక్కింది. దాదాపు నాలుగు గంటల సుధీర్ఘ సమావేశంలో జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై విస్తృతంగా చర్చించింది. భారత్కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇందులో ప్రధానంగా భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను పున: సమీక్షించాలని నిర్ణయించింది పాకిస్థాన్. దీంతో పాటు భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. దౌత్య సంబంధాలను కూడా తగ్గించాలని తీర్మానించింది. ఇస్లామా బాద్లోని భారత రాయబారి అజయ్ బిసారియాను వెనక్కి పంపింది.
ఇక ఢిల్లీకి రావాల్సిన పాకిస్థాన్ రాయబారిని సైతం రీకాల్ చేసింది. అక్కడితో ఆగలేదు. ఆర్టికల్ 370 రద్దుపై ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించింది. మరోవైపు. ఆగస్టు 14న కశ్మీరీలకు మద్దతుగా సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించింది. ఈ నెల 15న భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సైతం బ్లాక్ డే నిర్వహించాలని నిర్ణయించింది.
మరోవైపు ఆర్టికల్ 370 రద్దును ఖండించారు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆమోదం ఉన్న కశ్మీర్ ప్రతిపత్తిని రద్దు చేయడం దారుణమన్నారాయన. పాకిస్థాన్ దీన్ని ఎప్పటికీ ఒప్పుకోదని.. ప్రపంచం కూడా దీన్ని అంగీకరించదంటూ ట్వీట్ చేశారు ముషారఫ్. కశ్మీర్ విషయంలో భారత్ చర్యల్ని నిరసిస్తున్న పాక్ నేతలు . తన ఆశ్రోశాన్ని ఏదో విధంగా వెళ్లగక్కుతున్నారు. పుల్వామా తరహా దాడులు మరిన్ని జరగొచ్చంటూ.. విధ్వేషపూరితంగా మాట్లాడారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇప్పుుడు.. మనతో ద్వైపాక్షిక సంబంధాలు, భారత రాయబారిని బహిష్కరించడం వంటి నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయంశంగా మారాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com